- హోమ్›
- వార్తలు›
- బౌలర్లు , ఫీల్డర్లు ప్రతి క్షణం కష్టపడ్డారు ..ఇంగ్లాండ్ మీద విజయంపై స్పందించిన జాసన్ హోల్డర్ ..
బౌలర్లు , ఫీల్డర్లు ప్రతి క్షణం కష్టపడ్డారు ..ఇంగ్లాండ్ మీద విజయంపై స్పందించిన జాసన్ హోల్డర్ ..
By: Sankar Tue, 14 July 2020 7:16 PM
ఇంగ్లండ్పై తొలి టెస్టులో విజయం సాధించడంపై తమ జట్టు ఆటగాళ్లను వెస్టిండీస్ కెప్టెన్ జేసన్ హోల్డర్ ప్రశంసించాడు. ఈ టెస్టు నాలుగో రోజు తమ ప్లేయర్ల ఆట.. తన కెప్టెన్సీ హయాంలోనే అత్యుత్తమమైనదని చెప్పాడు. బౌలర్లతో పాటు సమిష్టిగా అందరూ రాణించడంతోనే గెలుపు సాధ్యమైందని అన్నాడు.
కరోనా వైరస్ కారణంగా దాదాపు నాలుగు నెలలు నిలిచిపోయిన అంతర్జాతీయ క్రికెట్.. సౌతాంప్టన్ వేదికగా ఇంగ్లండ్, వెస్టిండీస్ మధ్య టెస్టుతో పునఃప్రారంభమైంది. ఈ టెస్టులో అంచనాలను తలకిందులు చేస్తూ విండీస్ నాలుగు వికెట్ల తేడాతో ఆదివారం విజయఢంకా మోగించింది. దీనిపై హోల్డర్ సోమవారం మాట్లాడాడు. ‘నాలుగో రోజు మా జట్టు ప్రదర్శన ఎంతో అత్యుత్తమమైనది.
బౌలర్లే కాదు.. ఫీల్డర్లు కూడా రాణించారు. రోజంతా పూర్తి సామర్థ్యం కనబరిచారు. నా వల్ల కాదు, అలసిపోయా అని ఎప్పుడూ ఏ బౌలర్ కూడా చెప్పలేదు. ప్రతి క్షణం కష్టపడ్డారు’అని హోల్డర్ అన్నాడు. గతంలో ఎన్నో గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నామని, అందుకే ఈ మ్యాచ్లో గెలువాలని ఎంతో దృఢంగా నిశ్చయించుకున్నామని చెప్పాడు. నాలుగో రోజు ఆటలో బెన్ స్టోక్స్, క్రాలీని ఔట్ చేయడమే ఆటను మలుపు తిప్పిందని హోల్డర్ చెప్పాడు. జో రూట్ లాంటి అనుభవజ్ఞుడైన ఆటగాడు ఇంగ్లండ్కు దూరమవడం కూడా తమకు కాస్త కలిసొచ్చిందని అన్నాడు.