పది రూపాయలకే చీర ...జార్ఖండ్ ప్రభుత్వం కొత్త పథకం
By: Sankar Sun, 18 Oct 2020 4:04 PM
జార్ఖండ్ ప్రభుత్వం ఆ రాష్ట్ర ప్రజలకు ఓ తీపి వార్త చెప్పింది. పేదల కోసం రాష్ట్రంలో సరికొత్త పథకాన్ని అమల్లోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు రూ.10కే ధోతి లేదా లుంగీ, రూ.10కే చీరను అందజేయనున్నట్లు తెలిపింది.
అంటే రూ.20కే ధోతి, చీర రెండు ఇవ్వనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. అయితే ఈ అవకాశం ఏడాది పొడవునా ఉండదని, ఏడాదికి రెండు సార్లు మాత్రమే రూ.10 ధరతో వస్త్రాలు అందజేస్తామని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ స్పష్టంచేశారు. రాష్ట్రంలో జాతీయ ఆహార భద్రతాచట్టం పరిధిలోకి వచ్చే లబ్ధిదారులందరికీ ఆరు నెలలకు ఒకసారి దుస్తులు అందజేయనున్నట్లు జార్ఖండ్ ప్రభుత్వం ప్రకటించింది.
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హేమంత్ సోరెన్ నాయకత్వంలోని జేఎంఎం పార్టీ రాష్ట్ర ప్రజలకు తక్కువ ధరకు ప్రజలకు ధోతీలు, చీరలు ఇస్తామని మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చింది. ఆ మేరకు ఇప్పుడు సోరెన్ సర్కారు ఈ కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. కాగా, ఈ అవకాశాన్ని నిరుపేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జార్ఖండ్ ప్రభుత్వం కోరింది.