తెలంగాణ వరద బాధితులకు కోటి రూపాయల సాయం ప్రకటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్
By: Sankar Wed, 21 Oct 2020 08:19 AM
ఆపత్కాలంలో మరోసారి మానవతను చాటుకున్నారు జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్. వరద బాధితుల కోసం కోటి రూపాయలు విరాళాన్ని ప్రకటించారు. కష్టకాలంలో ప్రతి ఒక్కరూ స్పందించాలని కోరారాయన. వరద సహాయక చర్యల్లో జనసైనికులు పాల్గొనాలని పిలుపునిచ్చారు పవన్.
కాగా, తెలంగాణలో భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన ప్రజలను ఆదుకోవడానికి ప్రముఖులంతా ముందుకు రావాలన్న సీఎం కేసీఆర్ పిలుపుతో... చాలా మంది స్పందిస్తున్నారు. కోట్ల రూపాయల విరాళం ప్రకటించి పెద్దమనసు చాటుకుంటున్నారు. వర్షాలతో సతమతమవుతున్న భాగ్యనగర ప్రజల్ని ఆదుకోవడానికి సినీతారలు కదిలివస్తున్నారు. అనుకోని విపత్తు వేళ భారీ విరాళాలు ప్రకటిస్తూ ప్రజలకు మేమున్నామనే భరోసాను అందిస్తున్నారు.
ఇక హీరో ప్రభాస్, చిరంజీవి, మహేష్బాబు కోటి రూపాయల చొప్పున... నాగార్జున, ఎన్టీఆర్ 50 లక్షల చొప్పున విరాళం ఇస్తున్నట్లు ట్వీట్లు చేశారు. రామ్ 25 లక్షలు, విజయ్దేవరకొండ 10 లక్షలు, త్రివిక్రమ్ శ్రీనివాస్ 10 లక్షలు, హాసిని అండ్ హారికా క్రియేషన్స్ యజమానులు 10 లక్షలు విరాళం ప్రకటించారు. డైరెక్టర్లు అనిల్రావిపూడి, హరీష్ శంకర్తో పాటు నిర్మాత బండ్ల గణేష్ తలో ఐదు లక్షలు సాయం చేస్తున్నట్లు ప్రకటించారు