Advertisement

  • అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి రథం దగ్ధం ఘటనకు నిరసనగా బీజేపీకి మద్దతు తెలిపిన జనసేన

అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి రథం దగ్ధం ఘటనకు నిరసనగా బీజేపీకి మద్దతు తెలిపిన జనసేన

By: chandrasekar Thu, 10 Sept 2020 09:03 AM

అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి రథం దగ్ధం ఘటనకు నిరసనగా బీజేపీకి మద్దతు తెలిపిన జనసేన


రాష్ట్రంలో జరిగిన అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి రథం దగ్ధం ఘటనకు ప్రభుత్వం సరైన విచారణ జరిపి చర్యతీసికోవాలని నిరసన కార్యక్రమం జరగనుంది. అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి రథం దగ్ధం ఘటనకు నిరసనగా గురువారం భారతీయ జనతా పార్టీ తలపెట్టిన నిరసన కార్యక్రమానికి జనసేన పార్టీ తరఫున మద్దతు తెలియచేస్తుందని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. బీజేపీ నాయకత్వం జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌తో ఈ అంశంపై చర్చించారనీ, ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగా గురువారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు గంటపాటు ఎవరి ఇళ్ళల్లో వారు నల్ల బ్యాడ్జిలు, నల్ల రిబ్బన్లతో నిరసన తెలపాలని చెప్పారు. కరోనా వల్ల బయటకు రాకుండా ఇళ్ల నుండే నిరసనలు తెలపాలని కోరారు.

బుధవారం సాయంత్రం జనసేన పార్టీ పార్లమెంట్ సంయుక్త కమిటీల సమన్వయకర్తలు, సభ్యులతోనూ, అంతకు ముందు తూర్పుగోదావరి జిల్లా పార్టీ నేతలతో టెలీ కాన్ఫరెన్స్ లు నిర్వహించారు. అంతర్వేది పుణ్య క్షేత్రంలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి రథం దగ్ధమైన ఘటనలో ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనబడుతోందని, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు సరైన విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఏ ప్రభుత్వం మీదైనా ఉంటుందన్నారు. ఈ ఘటనపై తక్షణం రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఒక్కరు జనసేన పార్టీ తరఫున నిరసన కార్యక్రమంలో పాల్గొనాలి. భాగస్వామ్య పక్షంగా బీజేపీకి మద్దతు తెలుపుదాం.

ఇందుకుగాను నిరసనల్లో భాగంగా నిన్న అర్ధరాత్రి నుంచి ఈ రోజు ఉదయం వరకు తూర్పు గోదావరి జిల్లాలో జనసేన పార్టీకి చెందిన వివిధ నియోజకవర్గాల ఇంఛార్జులను, నాయకులను, కార్యకర్తలను హౌస్ అరెస్టులు చేయడం జరిగింది. అలాగే అంతర్వేదిలో చోటుచేసుకున్న ఘటనపై నిరసన తెలిపిన యువతను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని జనసేన తీవ్రంగా ఖండిస్తుంది. అక్కడ చోటు చేసుకున్న ఘటనపై బాధపడుతున్నవారిపైనే ఎదురు కేసులుపెట్టి అరెస్టులు చేయడం సరికాదు. ఆ సంఘటనకు బాధ్యులైనవారి గురించి విచారణపై దృష్టిపెట్టకుండా మనోభావాలు దెబ్బ తిన్నవాళ్లపై కేసులుపెడుతున్నారు.

ఈ సంఘటనలో అరెస్టు చేసినవారిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం అని అన్నారు. మరోవైపు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఈ రోజు అంతర్వేది శ్రీ లక్ష్మీనృసింహస్వామి ఆలయాన్ని సందర్శించారు. తొలుత 144 సెక్షన్ ఉందని, ఎవరినీ అనుమతించబోమని అధికారులు ఆయన పర్యటనకు నిరాకరించారు. అయితే, భారీ ఎత్తున బీజేపీ కార్యకర్తల నిరసనలు, నేతల విజ్ఞప్తి తర్వాత ఎట్టకేలకు సంఘటనా స్థలికి పరిమిత సంఖ్యలో చేరుకునేందుకు పోలీసు ఉన్నతాధికారులు అనుమతి ఇచ్చారు. అనంతరం లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామి వారిని దర్శించుకుని రథం కాలిన ప్రాంతానికి బీజేపీ బృందం వెళ్లింది. ఘటనస్థలిలో సోము వీర్రాజు ఆలయ అధికారులు, రెవెన్యూ, పోలీసు అధికారులతో మాట్లాడారు. దీనిపై తగిన చర్యలు తీసుకోవలసిందిగా సూచించారు.

Tags :

Advertisement