చనిపోయిన యువకుడి శవాన్ని 25 కిలోమీటర్లు మోసిన ఆర్మీ జవాన్లు
By: Sankar Wed, 02 Sept 2020 2:14 PM
ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసు జవాన్లు మానవత్వాన్ని చాటుకున్నారు. ఓ యువకుడి మృతదేహాన్ని సుమారు 8 గంటల పాటు 25 కిలోమీటర్ల మేర మోసుకెళ్లి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటన ఉత్తరాఖండ్లోని పిథోరగర్హ్ జిల్లాలో ఆగస్టు 30న చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది.
పిథోరగర్హ్ జిల్లాలోని మున్సియారి గ్రామానికి చెందిన 30 ఏళ్ల యువకుడు సుయుని గ్రామంలో చనిపోయాడు. రాళ్లను పగులగొడుతుండగా.. ప్రమాదవశాత్తు అవి యువకుడికి తాకడంతో ప్రాణాలు కోల్పోయాడు. యువకుడు మృతి చెందిన విషయం ఆగస్టు 30న ఐటీబీపీ జవాన్లకు తెలిసింది. అయితే సుయుని నుంచి మున్సియారి గ్రామానికి 25 కిలోమీటర్ల దూరం ఉంది. భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది.
దీంతో 8 మంది జవాన్లు.. 30న మధ్యాహ్నం మృతదేహాన్ని స్ర్టెచర్లో పెట్టి తమ భుజాలపైకి ఎత్తుకుని మోసుకెళ్లారు. అలా వారి నడక 8 గంటల పాటు కొనసాగింది. మృతదేహాన్ని జాగ్రత్తగా కుటుంబ సభ్యులకు అప్పజెప్పారు జవాన్లు. దీంతో కుటుంబ సభ్యులు జవాన్లకు కృతజ్ఞతలు తెలిపారు.