వరదల వేళ స్థానిక కాలనీల్లో పర్యటించిన మంత్రి సబితా కు చేదు అనుభవం
By: chandrasekar Fri, 16 Oct 2020 2:22 PM
ఈ వారం హైదరాబాద్
నగరాన్ని వరదలు ముంచెత్తిన సంగతి అందరికి తెలిసిందే. ప్రస్తుతం ఇక్కడ పర్యటించిన
మంత్రి సబితా కు చేదు అనుభవం ఎదురయింది. హైదరాబాద్లో వరదల వేళ స్థానిక కాలనీల్లో
పర్యటిస్తున్న ప్రజా ప్రతినిధులకు చేదు అనుభవాలు ఎదురవుతున్న సంగతి తెలిసిందే.
మంత్రి కేటీఆర్కు, ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డికి ఇలాంటి అనుభవాలే
ఎదురయ్యాయి. తాజాగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సైతం ఇలాంటి అనుభవం
చవిచూడాల్సి వచ్చింది.
భారీ వర్షాల కారణంగా
రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం నియోజకవర్గం పరిధిలో అల్మాస్ గుడా కురుమలగూడ
వరదల్లో చిక్కుకున్న కాలనీలో ఆమె పర్యటించారు. అయితే, ఈమె
పర్యటనపై కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు సమాచారం ఇవ్వకుండా సబితా
ఇంద్రారెడ్డి పర్యటన చేయడంపై కార్పొరేటర్లు నిలదీశారు. గత రెండు రోజులుగా స్థానిక
కౌన్సిలర్లు, కార్పొరేటర్లు బస్తీలో తిరుగుతూ ప్రజల అవసరాలను
గుర్తించే పనిలో ఉన్నారు.
మంత్రి పర్యటనపై కనీసం
స్థానిక కౌన్సిలర్లకు సమాచారం ఇవ్వకుండా వార్డుల్లో పర్యటించడం సరైంది కాదని వారు
మంత్రిని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. చేసేదేమీలేక మంత్రి సబితా ఇంద్రారెడ్డి
అక్కడి నుండి ఏమి సమాధానం చెప్పకుండా వెనుతిరిగారు. అయితే, గత
మూడు రోజులుగా మహేశ్వరం నియోజకవర్గంలోని కాలనీల్లో వరద నీరు నిలిచి ఉంది. ప్రజలు
ఇబ్బందులకు గురవుతున్నారు. కనీస నిత్యావసరాలు కూడా అందుబాటులో లేక ఇబ్బంది
పడుతున్నారు.