ప్రత్యేక బోగీలు ఏర్పాటు చేయలేము ..దక్షిణ మధ్య రైల్వే డీఆర్ఎం ఆనంద్
By: Sankar Tue, 23 June 2020 8:45 PM
వలస కార్మికుల స్వస్థలాల తరలింపుపై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణకు దక్షిణ మధ్య రైల్వే డీఆర్ఎం ఆనంద్ భాటియా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. వలస కార్మికులకు అదనపు బోగీల ఏర్పాటు విషయమై హైకోర్టు భాటియాను ప్రశ్నించింది. దీనిపై భాటియా స్పందిస్తూ.. ప్రత్యేక బోగీలు ఏర్పాటు చేయడం సాంకేతికంగా వీలు కాదన్నారు. బీహార్కు చెందిన 45 మంది వలస కూలీలను రేపు స్వస్థలాలకు చేరుస్తామని తెలిపారు.
అత్యవసర కోటాలో రేపటి రైళ్లలో టికెట్లు ఖరారు చేస్తామని పేర్కొన్నారు. ఒకవేళ కలెక్టర్లు కోరితే రోజుకు 50 మంది వలస కూలీలకు ఈక్యూలో టికెట్లు కేటాయించేదుకు సిద్ధమని ఆనంద్ భాటియా తెలిపారు. వలస కార్మికులందరూ తమ స్వస్థలాలకు చేరే వరకు ఇదే విధానం కొనసాగించాలంటూ హైకోర్టు స్పష్టం చేసింది.
కాగా ఇంతకుముందు వలస కార్మికులను తరలించేందుకు సాధారణ రైలుకు ఒక బోగీ ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం ఎందుకు వీలుకాదని హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై వివరణ ఇచ్చేందుకు దక్షిణ మధ్య రైల్వే డీఆర్ఎం మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ బి.విజయసేన్రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే