భారత్లో కరోనా పీక్ స్టేజ్కు చేరినట్లు అంచనా...26 లక్షలు పెరుగనున్న కరోనా కేసులు
By: chandrasekar Mon, 19 Oct 2020 3:40 PM
పండుగలు, శీతాకాలం
నేపథ్యంలో నెల రోజుల్లో 26 లక్షల మేర కరోనా కేసులు పెరుగవచ్చని కేంద్ర ప్రభుత్వం
నియమించిన కమిటీ హెచ్చరించింది. కేరళలో ఆగస్టు 22 నుంచి సెప్టెంబర్ 2 వరకు
జరిగిన ఓనం పండుగ వేడుకల తర్వాత సెప్టెంబర్ 8న ఆ రాష్ట్రంలో కరోనా కేసుల తీవ్రత ఒక్కసారిగా
పెరిగినట్లు గుర్తు చేసింది.
సెప్టెంబర్ నెలలో కేరళలో
కరోనా వ్యాప్తి 32 శాతం మేర పెరుగ్గా, వైద్య ప్రతిస్పందన 22 శాతం
తగ్గినట్లు కమిటీ తెలిపింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 30 శాతం
జనాభా మాత్రమే రోగ నిరోధకశక్తిని సాధించినట్లు పేర్కొంది. భారత్లో కరోనా పీక్
స్టేజ్కు చేరినట్లు అంచనా వేసింది. ఇప్పటి నుంచైనా సరైనా జాగ్రత్తలు పాటించకపోతే
వచ్చే ఏడాది ఆరంభం నాటికి కరోనా వైరస్ను నియంత్రించడం కష్టమని అభిప్రాయపడింది.
ఇప్పుడు దేశంలోని మొత్తం
కరోనా సంఖ్య 75 లక్షలకు చేరగా కరోనా అంతమయ్యే నాటికి ఈ సంఖ్య 1.05 కోట్లకు చేరవచ్చని అంచనా వేసింది. ఇప్పటి వరకు 1.14 లక్షల
కరోనా మరణాలు సంభవించాయని, మార్చి నెలలో లాక్డౌన్ విధించని పక్షంలో దేశంలో
కరోనా మరణాల సంఖ్య 25 లక్షలు దాటి ఉండేదని అభిప్రాయపడింది. పూర్తిస్థాయి
కార్యకలాపాల పునరుద్ధరణ దిశగా దేశం కదలాల్సిన అవసరం ఉన్నదని, ప్రస్తుతం
కొన్ని ప్రాంతాల్లో మాత్రమే లాక్డౌన్ అవసరమని కమిటీ పేర్కొంది.