రోజుకు 10 లక్షల కరోనా వ్యాక్సిన్లను ఇవ్వగల సామర్థ్యం ఉంది
By: chandrasekar Fri, 16 Oct 2020 5:47 PM
రోజుకు 10 లక్షల
కరోనా వ్యాక్సిన్లను ఇవ్వగల సామర్థ్యం తమకుందని అపోలో హాస్పిటల్స్ గ్రూప్
పేర్కొంది. వచ్చే ఏడాది ఆరంభంలో ఒకటి కంటే ఎక్కువ సంస్థల నుంచి కరోనా వైరస్
వ్యాక్సిన్ రావచ్చన్న అంచనాలున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్
అంటున్న విషయం తెలిసిందే. దీంతో దేశ ప్రజలందరికీ ఇవి చేరేలా చర్యలు
తీసుకుంటున్నామని ఆయన అంటున్నారు.
ఈ క్రమంలోనే ఈ మహమ్మారిపై
పోరులో ప్రభుత్వాలకు తమ వంతు సాయం ఉంటుందన్న అపోలో ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో
కరోనా నిర్మూలనే ప్రాధాన్యమని స్పష్టం చేసింది. ఇందులో భాగంగానే పెద్ద ఎత్తున
ప్రజలకు సురక్షితంగా, వేగంగా వ్యాక్సిన్ను అందజేయడానికి ప్రభుత్వాలతో
కలిసి పనిచేస్తామని గురువారం ఓ వర్చువల్ మీడియా కాన్ఫరెన్స్లో అపోలో హాస్పిటల్స్
గ్రూప్ ఎగ్జిక్యూటివ్ వైస్-చైర్పర్సన్ శోభనా కామినేని తెలిపారు.
‘అత్యంత సురక్షితంగా, అత్యున్నత ప్రమాణాలతో
రోజుకు 10 లక్షల
మోతాదుల కరోనా వ్యాక్సిన్లను ఇవ్వడానికి దేశవ్యాప్తంగా అన్ని అపోలో కేంద్రాలను
సిద్ధం చేశాం’ అని తెలిపారు. తమ వద్ద సుశిక్షితులైన 10వేల
మంది నిపుణులున్నారని, వీరిని అన్ని అపోలో హాస్పిటల్స్లోగల ఫార్మసీలకు, క్లినిక్లకు
పంపుతామన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా వీరంతా కరోనా వ్యాక్సిన్లను
ఇస్తారని, రోజుకు
10 లక్షల
డోసులనైనా ఇవ్వగలరని తెలియజేశారు. కాగా, వ్యాక్సిన్ల సరఫరా కోసం అతిపెద్ద కోల్డ్ చైన్ నెట్వర్క్, పంపిణీ
వ్యవస్థలనూ సిద్ధం చేస్తున్నామన్న ఆమె కనిష్ఠంగా 30 నిమిషాల్లో, గరిష్ఠంగా
రెండు రోజుల్లో దేశంలోని ఎక్కడికైనా వ్యాక్సిన్ను అందజేయగలమన్నారు. 130 కోట్ల
జనాభా కలిగిన ఈ దేశంలో దాదాపు 30 శాతం మంది అపోలో కేంద్రాలకు 30
నిమిషాల్లో చేరుకునే దూరంలోనే ఉన్నారన్నారు.