మాదేశ ప్రముఖ శాస్త్రవేత్త మరణంపై ప్రతీకారం తీర్చుకుంటాము ...ఇరాన్
By: Sankar Sun, 29 Nov 2020 7:52 PM
తమ దేశానికి చెందిన ప్రముఖ అణు శాస్త్రవేత్త మొహసిన్ ఫక్రిజడే దారుణ హత్యపై ఇరాన్ మండిపడుతోంది. ఆయన హత్యకు ఇజ్రాయెల్ కారణమని, ఇందుకు ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది.
ఇరాన్ రాజధాని టెహరాన్ కు సుమారు 50 మైళ్ళ దూరంలోని అబ్సార్డ్ ప్రాంతంలో 12 మంది దుండగులు మొహసిన్ వస్తున్న కాన్వాయ్ పై బాంబులు విసిరారు. కాల్పులు జరిపారు. వీరిలో కొందరు ఆయనను కారు నుంచి బయటికి లాగి కాల్పులు జరపడంతో ఆయన అక్కడికక్కడే మరణించాడు. ఈ హత్యకు మొత్తం 62 మంది కుట్ర పన్నారని ఇరానియన్ జర్నలిస్ట్ ఒకరు తెలిపారు.
ఇరాన్ జుడిషియల్ చీఫ్ అయతుల్లా ఇబ్రహీం రైసీ, తదితరులు మొహసిన్ శవపేటిక వద్ద ఆయనకు నివాళులు అర్పించారు. కాగా మధ్య ప్రాచ్య దేశాలు సంయమనంతో వ్యవహరించాలని, ఉద్రిక్తతలకు పోరాదని ఐక్యరాజ్యసమితి కోరింది. అమెరికా మిత్ర దేశమైన ఇజ్రాయెల్ పై ఇరాన్ ఎప్పటినుంచో తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఈ దాడిని బహుశా అమెరికా పరోక్షంగా ప్రోత్సహించి ఉండవచ్చునని భావిస్తోంది.