డోనాల్డ్ ట్రంప్పై ఇరాన్ ప్రభుత్వం అరెస్ట్ వారంట్ జారీ
By: chandrasekar Tue, 30 June 2020 5:12 PM
బాగ్దాద్లో డ్రోన్
దాడి జరిపి ఇరాన్ అగ్రశ్రేణి జనరల్ ఖాసిం సొలైమనిని అమెరికా దారుణంగా
హతమార్చారని ఇరాన్ నమ్ముతున్నది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్పై ఇరాన్
ప్రభుత్వం అరెస్ట్ వారంట్ జారీ చేసింది. ట్రంప్ను అరెస్ట్ చేసి తమకు
అప్పగించాలని ఇరాన్ ఇంటర్పోల్కు విజ్ఞప్తిచేసింది. ఈ విషయాన్ని ఇరాన్కు చెందిన
ప్రాసిక్యూటర్ ధ్రువీకరించారు.
టెహరాన్ అణు ఒప్పందం
నుంచి ఏకపక్షంగా అమెరికాను ట్రంప్ ఉపసంహరించుకున్నప్పటి నుంచి ఇరాన్-అమెరికా మధ్య
ఉద్రిక్తతలు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతగా పెరిగాయి. జనవరి మూడో తేదీన బాగ్దాద్లో
జనరల్ ఖాసిం సొలైమనిని చంపిన ఘటనలో ట్రంప్తోపాటు మరో 30
మందికి పైగా వ్యక్తుల ప్రమేయం ఉన్నదని టెహరాన్ ప్రాసిక్యూటర్ అలీ అల్కాసిమెహర్
అన్నారు.
ట్రంప్ తన అధ్యక్ష
పదవీకాలం ముగిసిన తర్వాత కూడా ప్రాసిక్యూషన్ను ఇరాన్ కొనసాగిస్తుందని నొక్కి
చెప్పాడు. ట్రంప్తోపాటు ఇతరులకు "రెడ్ నోటీసు" ఇవ్వమని కోరినట్లు
అల్కాసిమెహర్ పేర్కొన్నారు. ఇది ఇంటర్పోల్గా జారీ చేసిన అత్యున్నత స్థాయి అరెస్ట్
అభ్యర్థనను సూచిస్తుందని చెప్పారు. డోనాల్డ్ ట్రంప్పై ఆరెస్ట్ వారంట్ జారీ
చేయడంపై వ్యాఖ్యానించేందుకు ఫ్రాన్స్లోని లియాన్లో ఉన్న ఇంటర్పోల్ వెంటనే
స్పందించలేదు.
ఇరాన్ అరెస్ట్ వారంట్
కారణంగా ట్రంప్కు ఇప్పటికిప్పుడే ఎలాంటి
ప్రమాదం లేదని నిపుణులు చెప్తున్నారు. ఇలాఉండగా, ఫిర్యాదుదారు నుంచి
అభ్యర్థన స్వీకరించిన తరువాత సభ్యదేశాలతో సమాచారాన్ని పంచుకోవడంపై ఇంటర్పోల్
కమిటీ సమావేశమై చర్చిస్తుంది. నోటీసులను బహిరంగపరిచే ఎలాంటి అవసరం ఇంటర్పోల్కు
లేదు.