Advertisement

యూఏఈ వేదికగా ఐపీఎల్ 2020 సీజన్‌

By: chandrasekar Wed, 22 July 2020 2:30 PM

యూఏఈ వేదికగా ఐపీఎల్ 2020 సీజన్‌


భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తి పతాక స్థాయిలో ఉండటంతో సెప్టెంబరు 26 నుంచి నవంబరు 8 మధ్య ఇక్కడ ఐపీఎల్‌ని నిర్వహించడం అసాధ్యమని తేలిపోయింది. భారత్ వెలుపలే ఐపీఎల్ 2020 సీజన్ జరుగుతుందని ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేశ్ పటేల్ స్పష్టం చేశాడు. దాంతో యూఏఈ వేదికగా ఐపీఎల్ 2020 సీజన్‌ని నిర్వహించాలని నిర్ణయించినట్లు బ్రిజేశ్ పటేల్ వెల్లడించాడు.

యూఏఈ వేదికగా టోర్నీ నిర్వహణకి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి కోసం ఎదురుచూస్తున్నట్లు అతను వివరించాడు. ‘‘కరోనా వైరస్ కారణంగా వాయిదాపడిన ఐపీఎల్ 2020 సీజన్‌ని యూఏఈలో నిర్వహించాలని నిర్ణయించాం. ఈ మేరకు ప్రభుత్వ అనుమతి కోరాం. పర్మీషన్ వచ్చిన తర్వాత ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌లో చర్చించి పూర్తి స్థాయిలో షెడ్యూల్‌ని ప్రకటిస్తాం’’ అని బ్రిజేశ్ పటేల్ వెల్లడించాడు.

ఇప్పటికే వెలువడిన వార్తల ప్రకారం 44 రోజుల విండోలో 60 మ్యాచ్‌లను నిర్వహించాలని బీసీసీఐ ప్లాన్ చేస్తోంది. వాస్తవానికి మార్చి 29 నుంచి ఐపీఎల్ 2020 సీజన్ ప్రారంభంకావాల్సి ఉండగా కరోనా వైరస్ కారణంగా తొలుత టోర్నీని ఏప్రిల్ 15కి వాయిదా వేసిన బీసీసీఐ. అప్పటిలోపు పరిస్థితులు అదుపులోకి రాకపోవడంతో నిరవధికంగా వాయిదావేసింది.

కానీ.. ఆస్ట్రేలియా వేదికగా అక్టోబరు- నవంబరులో జరగాల్సిన టీ20 వరల్డ్‌కప్‌ని ఐసీసీ సోమవారం వాయిదావేయడంతో ఐపీఎల్‌కి మార్గం సుగుమమైంది. ఈ నేపథ్యంలో భారత్ వేదికగానే స్టేడియంలోకి ప్రేక్షకుల్ని అనుమతించకుండా ఐపీఎల్ మ్యాచ్‌లను నిర్వహిస్తారని అంతా ఊహించారు. కానీ.. అది కూడా సాధ్యంకాదని తేలిపోయింది. ఒకవేళ యూఏఈ ప్రభుత్వం అనుమతిస్తే, ఐపీఎల్ మ్యాచ్‌లకి ప్రేక్షకుల్ని అనుమతిస్తామని బ్రిజేశ్ పటేల్ వెల్లడించాడు.

Tags :
|
|
|
|

Advertisement