IPL 2020 MI Vs KXIP: ముంబై.. పంజా విసిరింది
By: Anji Fri, 02 Oct 2020 09:52 AM
ఆడిన మూడు మ్యాచ్ల్లో రెండు ఓటములతో కసి మీదున్న ముంబై ఇండియన్స్ పంజా విసిరింది. రోహిత్ శర్మ (45 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 70) అర్ధసెంచరీకి తోడు.. బౌలర్లు బుమ్రా (2/18), రాహుల్ చాహర్ (2/26), ప్యాటిన్సన్ (2/28) సమష్టి ప్రదర్శనతో చెలరేగారు.
ఫలితంగా పంజాబ్ కింగ్స్ లెవన్పై 48 పరుగుల తేడాతో ముంబై ఘనవిజయం సాధించింది. గురువారం జరిగిన ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్కు దిగిన ముంబై 20 ఓవర్లలో 4 వికెట్లకు 191 పరుగులు సాధించింది. ఆఖర్లో పొలార్డ్ (20 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 47 నాటౌట్), హార్దిక్ (11 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 30 నాటౌట్) దుమ్ము రేపారు.
ఆ తర్వాత ఛేదనలో పంజాబ్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 143 పరుగులు చేసి ఓడింది. పూరన్ (27 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 44) మాత్రమే రాణించాడు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా పొలార్డ్ నిలిచాడు.
ఆఖరాట అదుర్స్
మ్యాచ్ లో మొదటి 10 ఓవర్లు ముంబై వికెట్లు కాపాడుకోడానికే ప్రాధాన్యత ఇవ్వగా.. ఆఖరి పది ఓవర్లలో బౌలర్లను ఊచకోత కోశారు. కెప్టెన్ రోహిత్ శర్మ 45 బంతుల్లో 70 పరుగులు చేసి ఔట్ అవగా ఆఖర్లో హార్దిక్ పాండ్యా కీరన్ పోలార్డ్ సునామీ సృష్టించారు. పోలార్డ్ 20 బంతుల్లో 47 పరుగులు చేశాడు.
అతడి ఇన్నింగ్స్ లో నాలుగు సిక్సర్లు.. మూడు ఫోర్లు ఉన్నాయి. హార్దిక్ పాండ్యా కూడా చివర్లో మెరుపులు మెరిపించాడు. 11 బంతుల్లో 30 పరుగులు చేశాడు.. 3 ఫోర్లు 2 సిక్సర్లు బాదేశాడు.
దీంతో ముంబై స్కోరు 20 ఓవర్లు ముగిసే సమయానికి నాలుగు వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. ముంబై జట్టు ఆఖరి 6 ఓవర్లలో 104 పరుగులు చేసిందంటే పోలార్డ్ పాండ్యా ఎంతటి విధ్వంసం ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు.