ఐపీఎల్ ఆటగాళ్లకు నగదు చెక్కులు - 188 మందికి 555 కోట్లు చెల్లించనున్న ఫ్రాంచైజీలు
By: Dimple Sat, 08 Aug 2020 03:54 AM
ఐపీఎల్ 2020 సీజన్ కోసం ఎనిమిది ఫ్రాంచైజీలు కలిసి 188 ఆటగాళ్లకు 555 కోట్లరూపాయలను ఒప్పొంద ప్రకారం పారితోషికంగా అందించబోతున్నాయి. వీళ్లలో 125 మంది ఇండియన్ క్రికెటర్లకు 358 కోట్లరూపాయలు కాగా... 63 మంది విదేశీ ఆటగాళ్లకు 197 కోట్లు చెల్లిస్తున్నారు. ప్రపంచ శ్రేణి ఆటగాళ్లలో అత్యధిక వార్షిక పారితోషికం తీసుకునే ఆటగాళ్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టన్ విరాట్ కోహ్లీ 17కోట్లు తీసుకుంటున్నారు. కోహ్లీ తర్వాత అత్యధిక పారితోషికం తీసుకునే ఆటగాళ్లలో కోల్కతానైట్ రైడర్స్ ఆటగాడు ప్యాట్ కమిన్స్
15 కోట్ల యాభైలక్షల చెక్కును అందుకోబోతున్నాడు.
ఇండియన్ క్రికెటర్లలో విరాట్ కోహ్లీ తర్వాత అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే వాళ్లలో చెన్నై సూపర్ కింగ్స్ సారధి మహేంద్రసింగ్ ధోనీ 15 కోట్లు తీసుకుంటున్నారు. ఇదే తరహాలో ముంబై ఇండియన్స్ కెప్టన్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మకూడా 15 కోట్ల రూపాయలను పారితోషికం కింద అందుకోబోతున్నాడు. వీళ్లల్లో మహేంద్ర సింగ్ ధోనీ 2019 ప్రపంచకప్ పోటీల తర్వాత టీమిండియాకు దూరంగా ఉంటున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున మైదానంలో మెరుపు ఇన్నింగ్స్ చూడాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు.
63 మంది విదేశీ ఆటగాళ్లున్న ఐపీఎల్లో ఆస్ట్రేలియానుంచి అత్యధికంగా 17 మంది, ఇంగ్లాండునుంచి 13 మంది, దక్షిణాఫ్రికానుంచి 10 మందితోపాటు వెస్టిండీస్, శ్రీలంక, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ దేశాలకు చెందిన ఆటగాళ్లున్నారు. వీళ్లందరికీ 197 కోట్ల రూపాయలను చెల్లించేందుకు ఫ్రాంచైజీలు సిద్ధమయ్యాయి. కోల్కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ వేలంలో ఆస్ట్రేలియా పేస్ బౌలర్ ప్యాట్ కమిన్స్ను అత్యధికంగా 15 కోట్ల యాభైలక్షలరూపాయలకు దక్కించుకుంది. రాజస్థాన్ రాయల్ చాలెంజర్స్తో ఉన్న ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం 12 కోట్ల యాభైలక్షలు అందుకుంటున్నాడు. ఆతర్వాత సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టన్ డేవిడ్ వార్నర్ 12 కోట్లరూపాయలు, రాజస్థాన్ రాయల్స్తో జతకట్టిన స్టీవ్ స్మిత్ 12 కోట్ల రూపాయలు అందుకుంటున్నాడు. ఆతర్వాత అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే వాళ్లలో ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్స్ మెన్ గ్లెన్ మ్యాక్స్ వెల్ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 10 కోట్ల 75 లక్షలరూపాయలకు సొంతంచేసుకుంది.
చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ , ఆటగాళ్లకోసం అత్యధికంగా 84 కోట్ల 85 లక్షలరూపాయలను వెచ్చిస్తోంది. 24 మంది ఆటగాళ్లున్న ఈ జట్టులో 16 మంది ఇండియన్ క్రికెటర్లుకాగా... 8 మంది విదేశీ ఆటగాళ్లున్నారు.
ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ, ఆటగాళ్లకోసం 83 కోట్ల ఐదు లక్షలరూపాయలను చెల్లిస్తోంది. 24 మంది ఆటగాళ్లలో 16 మంది ఇండియన్ క్రికెటర్లు కాగా... 8 మంది విదేశీ ఆటగాళ్లున్నారు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ ఆటగాళ్లకోసం 78 కోట్ల అరవై లక్షలు ఖర్చు పెడుతోంది. 21 మంది ఆటగాళ్లున్న ఈ జట్టులో 13 మంది ఇండియన్ క్రికెటర్లు... 8 మంది విదేశీ ఆటగాళ్లున్నారు.
ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ ఆటగాళ్లకోసం 76 కోట్ల రూపాయలను ఖర్చుచేస్తోంది. 22 మంది ఉన్న ఈ జట్టులో 14 మంది ఇండియన్ క్రికెటర్లు... 8 మంది విదేశీ ప్లేయర్లున్నారు.
కోల్కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ తమ ఆటగాళ్లకోసం 76 కోట్ల యాభై లక్షల రూపాయలను ఖర్చు చేస్తోంది. 23 మంది ఉన్న ఈ జట్టులో 15 మంది ఇండియన్ క్రికెటర్లుకాగా.. 8 మంది విదేశీ ఆటగాళ్లున్నారు.
సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ క్రికెటర్లకోసం 74 కోట్ల 90 లక్షల రూపాయలను వెచ్చిస్తోంది. 25 మంది ఆటగాళ్లున్న ఈజట్టులో 17 మంది ఇండియన్ క్రికెటర్లు... 8 మంది విదేశీ ఆటగాళ్లున్నారు.
రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ క్రికెటర్లకు 70 కోట్ల 20 లక్షలరూపాయలను రెమ్యునరేషన్ చెల్లిస్తోంది. 25 మంది క్రికెటర్లున్న ఈ జట్టులో 17 మంది ఇండియన్ క్రికెటర్లు... 8 మంది విదేశీ ఆటగాళ్లున్నారు.
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఫ్రాంచైజీ తమ ఆటగాళ్లకు 68 కోట్ల యాభై లక్షల రూపాయలు రెమ్యునరేషన్ ఇస్తోంది. 25 మంది ఆటగాళ్లలో 17 మంది ఇండియన్ క్రికెటర్లుకాగా 8 మంది విదేశీ ఆటగాళ్లున్నారు.