‘జీ7’లో భారత్కు చోటు దక్కే సూచనలు
By: chandrasekar Tue, 02 June 2020 1:27 PM
ప్రపంచంలో అత్యంత
అభివృద్ధి చెందిన దేశాల కూటమి అయిన ‘జీ7’లో భారత్కు చోటు దక్కే సూచనలు
కనిపిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ మేరకు శనివారం
సంకేతాలిచ్చారు. జీ7 వార్షిక సదస్సును జూన్లో నిర్వహించాలని భావించిన ట్రంప్ దాన్ని సెప్టెంబర్కు వాయిదా వేస్తున్నట్లు
ప్రకటించారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సభ (యూఎన్జీఏ) సమావేశాలకు వారం ముందుగానీ, తర్వాత గానీ జీ7 సదస్సు నిర్వహించనున్నట్లు ట్రంప్
తెలిపారు.
అలాగే కూటమిలో మరికొన్ని
దేశాలను చేర్చుకోనున్నట్లు ట్రంప్ సంకేతాలిచ్చారు. వీటిలో రష్యా, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియాతోపాటు
భారత్ కూడా ఉండడం విశేషం. ప్రస్తుతమున్న జీ7 కూటమి ‘కాలం చెల్లినదని’ ట్రంప్ అభిప్రాయపడ్డారు.
ప్రపంచం మొత్తానికి ఈ
కూటమి ప్రాతినిధ్యం వహించడం లేదని, మరికొన్ని
దేశాల చేరికతో జీ10 లేదా జీ11గా మార్చాల్సిన అవసరం ఉన్నదన్నారు. నవంబర్లో అధ్యక్ష
ఎన్నికల తర్వాత దీనికి శ్రీకారం చుట్టనున్నట్లు వెల్లడించారు. చైనాకు చెక్
పెట్టేందుకే వైట్హౌస్ స్ట్రాటజిక్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ అలిసా
అలెగ్జాండ్రా ఫరా మీడియాతో మాట్లాడుతూ చైనాకు చెక్ పెట్టేందుకు సంప్రదాయ
మిత్రదేశాలు ఏకతాటికి రానున్నాయని చెప్పారు. జీ7 కూటమికి ప్రస్తుతం అమెరికా
అధ్యక్షత వహిస్తున్నది.
కరోనా నేపథ్యంలో ఆన్లైన్
ద్వారా సదస్సు నిర్వహించాలని భావించారు. అయితే ట్రంప్ మాత్రం ప్రత్యక్షంగానే
సదస్సు నిర్వహించాలని పట్టుబడుతున్నారు. ఏటా, సదస్సుకు
అధ్యక్షత వహించే దేశం రెండు దేశాలను ప్రత్యేక ఆహ్వానితులుగా ఆహ్వానిస్తుంది. గత
ఏడాది అధ్యక్షత వహించిన ఫ్రాన్స్ భారత ప్రధాని మోదీని ఆహ్వానించింది. వచ్చే
సమావేశాలకు కూడామోదీని ఆహ్వానించే అవకాశం ఉన్నది. ఇది అంతర్జాతీయంగా భారత్ పరపతి
పెరుగుతున్నదనడానికి నిదర్శనమని విశ్లేషకులు అభిప్రాయం.
పారిశ్రామికంగా అత్యంత
అభివృద్ధి చెందిన దేశాల సమూహమే జీ7 1975లో ఆరు దేశాలతో ప్రారంభమైంది. అవి ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, అమెరికా, బ్రిటన్, జపాన్. 1976లో కెనడా చేరికతో జీ7గా మారింది. 1998లో
రష్యా ఎనిమిదో సభ్య దేశంగా చేరడంతో జీ8గా రూపాంతరం చెందింది. అయితే క్రిమియాను
ఆక్రమించుకోవడంతో 2014లో రష్యాను కూటమి నుంచి సస్పెండ్ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ
కూటమిని జీ7గా పిలుస్తున్నారు. అంతర్జాతీయంగా మరింత ఆర్థిక స్థిరతం, సహకారం సాధించేందుకు వీలుగా, పారిశ్రామిక దేశాధినేతల మధ్య ఏకాభిప్రాయ సాధనే జీ7
ముఖ్య లక్ష్యం.