గాల్వన్ లోయ తమదేనంటూ చైనా చేసిన వ్యాఖ్యలపై భారత్ తీవ్ర స్పందన
By: chandrasekar Fri, 19 June 2020 10:13 AM
తూర్పు లడఖ్లోని గాల్వన్
లోయ తమదేనంటూ చైనా చేసిన వ్యాఖ్యలపై భారత్ తీవ్రంగా స్పందించింది. జూన్ 6న జరిగిన లెఫ్టినెంట్ జనరల్ స్థాయి సైనిక అధికారుల
మధ్య జరిగిన చర్చల సందర్భంగా వచ్చిన అవగాహనకు విరుద్ధంగా పొరుగుదేశం ఆమోదయోగ్యం
కాని ప్రకటనలు చేస్తోందని మండిపడింది. ఈ విషయంగా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి
అనురాగ్ శ్రీవాస్తవ్ గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జూన్ 6న భారత్, చైనా
సైనికాధికారుల మధ్య జరిగిన చర్చల సందర్భంగా కుదిరిన ఒప్పందాన్ని శ్రీవాస్తవ్
ప్రస్తావించారు.
భారత్, చైనా సైనికుల మధ్య గాల్వన్ లోయ వద్ద సోమవారం రాత్రి
జరిగిన ఘర్షణల్లో కల్నల్ సహా 20 మంది
ఇండియన్ ఆర్మీకి చెందిన సైనికులు వీరమరణం పొందిన విషయం తెలిసిందే. వాస్తవాధీన రేఖ
వెంబడి 1967 భారత్, చైనా
యుద్ధం తర్వాత జరిగిన అతిపెద్ద హింసాత్మక ఘటన ఇదే కావడం గమనార్హం. అప్పటి యుద్ధంలో
చైనాను భారత్ చావుదెబ్బ కొట్టింది. చైనావైపు 300 మంది
సైనికులు చనిపోగా భారత్వైపు 80 మంది
జవాన్లు వీరమరణం పొందారు. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో గురువారం ఉదయం ఫోన్లో
మాట్లాడిన భారత విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ జూన్ 6న చర్చల సందర్భంగా కుదిరిన అవగాహనకు కట్టుబడి ఉండాలని
స్పష్టం చేశారు.
లడఖ్లో ప్రస్తుత
పరిణామాలపై చైనా విదేశాంగ మంత్రితో జయశంకర్ మాట్లాడినట్టు శ్రీవాస్తవ్ తెలిపారు.
‘మొత్తం పరిస్థితిని బాధ్యతాయుతంగా నిర్వహించి, జూన్ 6 న సీనియర్ కమాండర్స్థాయి అధికారుల మధ్య కుదిరిన
అవగాహనను హృదయపూర్వకంగా అమలు చేయాలని ఇరు పక్షాలు అంగీకరించాయి. అతిశయోక్తి, ఆమోదయోగ్యం కాని వాదనలు చేయడం ఈ అవగాహనకు విరుద్ధం’
అని అన్నారు. గాల్వన్ లోయ వద్ద చోటుచేసుకున్న సంఘటన ద్వైపాక్షిక సంబంధాలపై
తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుందని, ప్రత్యక్షంగా
చైనా సైన్యం హింసకు కారణమైందని విదేశాంగ మంత్రి వాంగ్ యీతో జరిగిన ఫోన్ సంభాషణలో
జైశంకర్ స్పష్టం చేశారు.