కరోనా సెకండ్ వేవ్ కారణంగా యూరప్ నుంచి వెనక్కి వస్తోన్న భారతీయులు
By: chandrasekar Fri, 20 Nov 2020 3:27 PM
యూరప్, అమెరికా
తదితర దేశాలు కరోనా సెకండ్ వేవ్తో గడగడలాడుతున్నాయి. ఈ నేపధ్యంలో అక్కడున్న విదేశీయులను వెనక్కు పంపించేస్తున్నాయి.
ఉద్యోగులు, కూలీలు, ఇతరత్రా వ్యాపార, వాణిజ్య కార్యకలాపాల కోసం ఆ దేశాలకు వెళ్లిన ఇక్కడి
వారు తిరిగొస్తున్నారు. అక్కడ నేరాలకు పాల్పడి జైళ్లలో ఉన్న మనవారిని కూడా
పంపించేస్తున్నారంటే కరోనా సెకండ్ వేవ్తో ఆ దేశాలు ఎలా వణికిపోతున్నాయో అర్థం
చేసుకోవచ్చు. ప్రస్తుతం హైదరాబాద్కు ప్రతిరోజూ విదేశాల నుంచి 11
అంతర్జాతీయ విమానాలు వస్తున్నాయి. అందులో నిత్యం దాదాపు 2 వేల
మంది ప్రయాణికులు వస్తున్నారు. వారిలో ఎక్కువ మంది ఆయా దేశాల్లో కరోనా నెగెటివ్
టెస్టు రిపోర్టులు పట్టుకొని వస్తుండగా, కొందరైతే హైదరాబాద్ విమానాశ్రయంలో దిగాక పరీక్షలు
చేయించుకుంటున్నారు. అందుకోసం విమానాశ్రయంలో ప్రత్యేకంగా ఆర్టీపీసీఆర్ పరీక్ష
చేసే లేబొరేటరీని ఏర్పాటు చేశారు. కరోనా సెకండ్ వేవ్తో రోజుకు లక్షల్లో కేసులు, వేలల్లో
మరణాలు నమోదవుతున్నాయి. దీంతో కరోనా వైద్యం అందరికీ అందించడం ఆయా దేశాలకు సవాల్గా
మారింది. అందువల్ల అవకాశమున్నంత మేరకు విదేశీయులను వారి దేశాలకు
పంపించేస్తున్నాయి.
హైదరాబాద్కు విమానాల
ద్వారా బ్రిటన్, అమెరికా దేశాల నుంచి ఎక్కువ మంది వస్తున్నారని
అధికారులు చెబుతున్నారు. ఇటు సింగపూర్, దుబాయ్ల నుంచి కూడా కొందరు వస్తున్నారు. వీరేగాక ఆయా
దేశాల్లో విమానాలు ఎక్కిన వారు ఢిల్లీ, చెన్నై, బెంగళూరులలో దిగి దేశంలో స్థానిక విమానాల ద్వారా
హైదరాబాద్కు చేరుకుంటున్నారు. ఇటు ఆయా దేశాల నుంచి వచ్చే ఖైదీల్లో కొందరు
హైదరాబాద్లో దిగాక కనీసం హోటల్ క్వారంటైన్లో కూడా ఉండలేని దుస్థితి నెలకొంది. డబ్బులు
లేవని, తమను
విడుదల చేసి పైసా చేతిలో పెట్టకుండా పంపించేశారని వారంటున్నారు. విదేశాల నుంచి వచ్చే వారి సంఖ్య పెరగటంతో
మరిన్ని విమానాలు నడిపేందుకు కొన్ని విమానయాన సంస్థలు ఏర్పాట్లు చేసుకున్నాయి.
వచ్చిన వారిని క్వారంటైన్కు తరలించేలా, అందుకు అవసరమైన సహకారం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి
లేఖ రాశాయి. మరో పది విమానాలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చిందని అధికారులు
పేర్కొన్నారు. దీంతో విదేశాల నుంచి వచ్చే వారి సంఖ్య రోజుకు మరో 4 వేల
మంది వరకు పెరగొచ్చని భావిస్తున్నారు. కరోనా కారణంగానే తాము ఇక్కడకు వస్తున్నట్లు, ఆయా దేశాల
ప్రభుత్వాలు పంపించి వేస్తున్నట్లు ప్రయాణికులు అంటున్నారు. యూరప్ వంటి దేశాల్లో
కరోనా టెస్టులు చేయించుకోవడం కూడా కష్టంగా మారిందని ఇక్కడ కరోనా పరీక్షలు
విమానాశ్రయంలోనే చేస్తుండటంతో కొంతమేరకు ఊరటగా ఉందని అంటున్నారు. విదేశాల నుంచి
వేలాది మంది వస్తుండటంతో కరోనా నెగెటివ్ రిపోర్టులు చూడడం, రిపోర్టులు
లేని వారికి పరీక్షలు చేస్తుండటంతో విమానాశ్రయ సిబ్బందిపై ఒత్తిడి పెరిగింది.