భారత యువ క్రికెటర్ కు కరోనా పాజిటివ్
By: Sankar Thu, 13 Aug 2020 1:23 PM
భారత యువ క్రికెటర్ కరుణ్ నాయర్ కరోనా బారిన పడి కోలుకున్నారు.. కరుణ్ నాయర్కి రెండు వారాల క్రితమే కరోనా వైరస్ సోకినట్లు మెడికల్ రిపోర్ట్ల ద్వారా తేలింది. టీమిండియాకి ఆడుతున్న క్రికెటర్కి కరోనా వైరస్ సోకడం ఇదే తొలిసారికాగా.. 1981లో రిటైర్మెంట్ ప్రకటించిన మాజీ క్రికెటర్ చేతన్ చౌహాన్ గత జులై 12న ఈ వైరస్ బారినపడిన విషయం తెలిసిందే.
కర్ణాటకకి చెందిన కరుణ్ నాయర్.. భారత్ తరఫున ఆరు టెస్టులు, రెండు వన్డే మ్యాచ్లాడాడు. మరి టీమిండియాకి ఆడిన క్రికెటర్కి కరోనా వైరస్ సోకడమంటే..? చాలా పెద్ద వార్త. కానీ.. రెండు వారాల పాటు కరుణ్ నాయర్తో పాటు కర్ణాటక క్రికెట్ అసోషియేషన్ (కేఏసీ) కూడా ఈ విషయాన్ని గోప్యంగా ఉంచింది. తాజాగా కరుణ్ నాయర్ వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నాడని.. ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో అతనికి నెగటివ్ వచ్చినట్లు స్పోర్ట్స్స్టార్ తెలిపింది. దాంతో.. ఐపీఎల్ 2020 సీజన్ కోసం కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుతో అతను త్వరలోనే చేరేందుకు మార్గం సుగుమమైంది.
యూఏఈకి ఐపీఎల్ కోసం క్రికెటర్లని పంపేముందు రెండు సార్లు వారికి కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించాలని అన్ని టీమ్స్ ఫ్రాంఛైజీలకి.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇటీవల స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. అక్కడికి వెళ్లిన వెంటనే ఒకసారి.. క్వారంటైన్లో రెండు సార్లు.. ఇలా మొత్తంగా.. ఐపీఎల్కి ముందు ప్రతి క్రికెటర్కి ఐదు సార్లు కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ ఐదు పరీక్షల్లో నెగటివ్ వచ్చిన వారిని మాత్రమే బయో- సెక్యూర్ బబుల్లోకి బీసీసీఐ అనుమతించనుంది.