విద్వేష పూరిత వాఖ్యలతో అమెరికాలో ఇండియన్ రెస్టారంట్ పై దాడి
By: Sankar Wed, 24 June 2020 8:39 PM
అమెరికాలో ఇతర దేశాల నుంచి వచ్చినవారికి భద్రత ఉండదు అనడానికి సాక్ష్యంగా అమెరికాలో మరొక సంఘటన జరిగింది ..ఇప్పటికే నల్ల జాతీయుడు మరణం ఉదంతంతో అట్టుడికిన అమెరికా లో తాజాగా ఇప్పుడు భారతీయుల మీద దాడి జరిగింది ..అమెరికాలోని భారతీయ హోటల్ను కొందరు దుండగులు ధ్వంసం చేశారు.
అనంతరం విద్వేషపూరిత వ్యాఖ్యలతో హోటల్ గోడలను నింపేసినట్లు అక్కడి మీడియా పేర్కొంది. న్యూ మెక్సికోలోని సాంటే ఫె సిటీలో బల్జీత్ సింగ్ అనే సిక్కు వ్యక్తి భారతీయ రెస్టారెంట్ నిర్వహిస్తున్నాడు. మంగళవారం ఉన్నట్టుండి కొందరు దుండగులు హోటల్లోకి చొచ్చుకు వచ్చి అక్కడి వస్తువులను ధ్వంసం చేశారు. దేవుళ్ల విగ్రహాలను కిందపడేశారు. వంటగదిని సర్వనాశనం చేశారు. గోడలపై 'వైట్ పవర్', 'ట్రంప్ 2020', 'స్వదేశానికి వెళ్లిపో' అంటూ బెదిరింపు వ్యాఖ్యలను రాశారు
అనంతరం కంప్యూటర్లను దొంగిలించారు. ఈ దాడి వల్ల రెస్టారెంట్ యజమానికి లక్ష డాలర్ల నష్టం వాటిల్లింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఈ చర్యను సిక్ అమెరికన్ లీగల్ డిఫెన్స్ అండ్ ఎడ్యుకేషన్ ఫండ్(ఎస్ఏఎల్డిఈఎఫ్) తీవ్రంగా ఖండించింది. ఇలాంటి హింస ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని హెచ్చరించింది. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. కాగా జార్జ్ ఫ్లాయిడ్ హత్యోదంతంతో అమెరికా అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే. స్పానిష్ వలసవాదుల విగ్రహాలను తొలగించడంతో ఈ ఆందోళనలు మరింత భగ్గుమన్నాయి.