పండుగకు రైల్వే ప్రయాణం చేయాలనుకుంటున్నారా ..అయితే ఇవి తెలుసుకోండి
By: Sankar Fri, 16 Oct 2020 2:44 PM
ఓవైపు కరోనా.. మరోవైపు పండుగల సీజన్.. పండుగల సమయంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది భారతీయ రైల్వేశాఖ... రైళ్లలో ప్రయాణించే వాళ్లు కోవిడ్ రూల్స్ తప్పనిసరిగా పాటించాలని, స్టేషన్లోకి ప్రవేశించినప్పటి నుంచి ప్రయాణం ముగిసే వరకు మాస్కు ధరించే ఉండాలని స్పష్టం చేసింది. కాగా, దసరా పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది రైల్వేశాఖ.. ఈ నేపథ్యంలో కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.
ప్రయాణికులు రైల్వే స్టేషన్లో అడుగుపెట్టినప్పటి నుంచి తమ గమ్యస్థానానికి చేరుకుని మళ్లీ స్టేషన్ దాటిన వరకు మాస్క్ తప్పనిసరి.. రైళ్లలో, స్టేషన్ పరిసరాల్లో ఉమ్మివేయడం, ఎక్కడపడితే అక్కడ వ్యర్థాలను పడవేయడంపై కూడా నిషేధం విధించింది.. ఇక, కోవిడ్ పాజిటివ్గా తేలినవారు, పరీక్షలకు శాంపిళ్లు ఇచ్చినవారు కూడా తమ ప్రయాణాలను రద్దు చేసుకోవాలని రైల్వేశాఖ సూచించింది.
ఈ మార్గదర్శకాలను ఉల్లంఘించిన వారికి రైల్వే చట్టం ప్రకారం జైలు శిక్ష లేదా జరిమానా... లేదా రెండూ ఉండవచ్చని హెచ్చరించింది రైల్వేశాఖ. కాగా, కరోనా లాక్డౌన్తో రైల్వేసర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయి.. మొదట్లో కొన్ని ప్రత్యేక రైళ్లను మాత్రమే నడపగా.. ఆ తర్వాత.. వలసకార్మికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు మరికొన్ని రైళ్లను వేశారు.. ఆ తర్వాత క్రమంగా రైళ్లు పట్టాలెక్కుతున్నాయి.