నేపాల్ ప్రభుత్వ చర్యకు భారత విదేశాంగ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాత్సవ ఖండనం
By: chandrasekar Mon, 15 June 2020 2:41 PM
భారత దేశానికి చెందిన
కాలాపానీ, లిపులేక్, లింపుయాధురా
ప్రాంతాలను తమవిగా పేర్కొంటూ నేపాల్ తీసుకొచ్చిన కొత్త మ్యాప్కు ఆ దేశ
పార్లమెంట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. నేపాల్ దుందుడుకు చర్యలపై భారత్
తీవ్రంగా స్పందించింది. నేపాల్ ప్రభుత్వ చర్య ఎంతమాత్రం సమర్థనీయం కాదని చారిత్రక
వాస్తవాలను ఆ దేశం విస్మరించిందని మండిపడింది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ అధికార
ప్రతినిధి అనురాగ్ శ్రీవాత్సవ ఓ ప్రకటన చేశారు. భారత భూభాగాలను తమవిగా పేర్కొంటూ
చేసిన రాజ్యాంగ సవరణ బిల్లుకు నేపాల్ దిగువ సభ ఆమోదం తెలిపింది. మ్యాప్ విషయంలో
ఇది వరకే మా వైఖరిని స్పష్టంచేశాం. చారిత్రక వాస్తవాలను, సాక్ష్యాలను
విస్మరించి కృత్రిమంగా ఆ భూభాగాలను నేపాల్ తమవిగా చెప్పుకోవడం ఎంతమాత్రం
సమర్థనీయం కాదు అని ఉద్ఘాటించారు.
ఇరు దేశాల సరిహద్దు
అంశానికి సంబంధించి కలిసి చర్చించుకోవాలన్న కనీస అవగాహనను నేపాల్ ఉల్లంఘించిందని
శ్రీవాస్తవ్ దుయ్యబట్టారు. భారత్ భూభాగాలైన లిపులేఖ్, కాలాపానీ, లింపియాధురా
ప్రాంతాలను తమ భూభాగాలుగా పేర్కొంటూ వివాదాస్పద కొత్త మ్యాప్కు సంబంధించిన
రాజ్యాంగ సవరణ బిల్లుకు నేపాల్ దిగువ సభ శనివారం ఆమోదం తెలిపింది. గడచిన ఐదేళ్లలో భారత్-నేపాల్ మధ్య వివాదం
తలెత్తడం ఇది రెండోసారి. శనివారం నేపాల్ పార్లమెంట్లో ఈ బిల్లుపై చర్చ సందర్భంగా
సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు ఉపేంద్ర మాట్లాడుతూ
మహాకాళీ ఒప్పందాన్ని కూడా సవరించాలని సూచించారు. అయితే, దీనికి
స్పీకర్ అగ్ని సప్కోత మాత్రం అంగీకరించలేదు. కేవలం సోషలిస్ట్ పార్టీ ఎంపీ సరితా
గిరి ప్రతిపాదనలను మాత్రమే అంగీకరించారు.
ప్రస్తుత నేపాల్ వివాదం
విషయంలో భారత్ ఆచితూచి వ్యవహరిస్తోంది. ఇటీవల నేపాల్ పోలీసులు సరిహద్దుల్లో
విచక్షణారహితంగా కాల్పులకు తెగబడి ఓ భారతీయుడిని హత్యచేశారు. ఈ ఘటనపై భారత్ ఎలాంటి
తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆచితూచి వ్యవహరించింది. కాగా, నేపాల్తో
సంబంధాలపై ఆర్మీ చీఫ్ ఎంఎం నరవాణే కూడా మాట్లాడుతూ ఆ దేశంలో బలమైన సంబంధాలు
కొనసాగుతున్నాయన్నారు. భౌగోళికంగా, మతపరంగా, చరిత్రాత్మకంగా, సాంస్కృతికంగా బంధం ఉంది. ప్రజల మధ్య కూడా మంచి
సంబంధాలు ఉన్నాయి. ఆ దేశంతో ఎల్లప్పుడూ బలమైన సంబంధాలను కోరుకుంటామని, భవిష్యత్తులోనూ
ఇవి కొనసాగుతాయని నరవాణే వ్యాఖ్యానించారు.