- హోమ్›
- వార్తలు›
- చైనా దూకుడుకు కళ్లెం వేసేందుకు చతుర్ముఖ వ్యూహంతో కదులుతున్న భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలు
చైనా దూకుడుకు కళ్లెం వేసేందుకు చతుర్ముఖ వ్యూహంతో కదులుతున్న భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలు
By: chandrasekar Sat, 19 Sept 2020 1:23 PM
భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా
దేశాలు ఇండో- ఫసిఫిక్ సముద్రజలాలపై ఆధిపత్యం కోసం చైనా చేస్తున్న ప్రయత్నాలను
తిప్పికొట్టేందుకు వ్యూహరచన చేస్తున్నాయి. డ్రాగన్ ప్రణాళికలకు ఫుల్స్టాప్ పెట్టేలా
పరస్పర సైన్య సహకారాలకు ఉద్దేశించిన క్వాడ్ (క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్)
గురించి చర్చించడం కోసం త్వరలోనే ఆ నాలుగు దేశాలు సమావేశం కానున్నాయి.
ఈ మేరకు వచ్చే నెలాఖరులో
భారత్, అమెరికా
విదేశాంగ మంత్రులు న్యూఢిల్లీలో 2+2 చర్చలకు సిద్ధమైనట్లు సమాచారం. ఇక భారత విదేశీ
వ్యవహారాల మంత్రి జైశంకర్, అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియోతోపాటు జపాన్
విదేశాంగ మంత్రి తోషిమిత్సు మెటేగి, ఆస్ట్రేలియా ఫారిన్ మినిస్టర్ మారిస్ పైన్
తదితరులు భేటీ అయ్యి తాజాగా అంతర్జాతీయ పరిణామాలు, శాంతి సుస్థిరతకై
ప్రణాళికలతోపాటు ఆయా దేశాలకు సంబంధించిన వివిధ అంశాల గురించి చర్చించబోతున్నారు.
ఈ సమావేశానికి సంబంధించిన
వేదిక, తేదీని
ఖరారు చేయాల్సి ఉండగా జపాన్లో ఇటీవల చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో
కాస్త ఆలస్యం అయ్యింది. 2+2 చర్చల్లో భాగంగా అమెరికా, భారత
రక్షణ మంత్రులు కూడా న్యూఢిల్లీలో సమావేశమై తాజా పరిస్థితుల గురించి
చర్చించనున్నారు. క్వాడ్ ప్రత్యేకంగా ఏ దేశాన్ని టార్గెట్ చేయనప్పటికీ
వాస్తవాధీన రేఖ వెంబడి చైనా ఆర్మీ చర్యలు, ఇండో- ఫసిఫిక్, దక్షిణ చైనా సముద్ర జలాల్లో డ్రాగన్ అనుసరిస్తున్న
వైఖరి తదితర అంశాలపైనే ప్రధానంగా చర్చ జరుగనున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా
దక్షిణ చైనా సముద్రంపై పైచేయి సాధించేందుకు చైనా చేస్తున్న కుట్రలను
తిప్పికొట్టేందుకు, మలబార్ తీరంలో నాలుగు దేశాలు మరోసారి నావికా దళ
విన్యాసాలు నిర్వహించే అంశం కూడా ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. ఇక
ఇండో-ఫసిఫిక్ జలాల్లో కృత్రిమ నిర్మాణాలు చేపట్టకుండా, అక్కడ
జరుగుతున్న పరిణామాలపై ఓ కన్నేసి ఉంచి, పరస్పరం సమాచారం అందజేసుకునే ఉద్దేశంతో రూపొందిన
క్వాడ్ చర్చల్లో భాగంగా జియోస్పేషియల్ డేటాతోపాటు పెండింగ్లో ఉన్న పలు
ప్రాథమిక ఒప్పందాల గురించి భారత్-అమెరికా మధ్య ఏకాభిప్రాయం కుదిరే అవకాశం
ఉన్నట్లు తెలుస్తోంది.