దేశంలో రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు...తాజాగా 1172 కరోనా మరణాలు
By: Sankar Thu, 10 Sept 2020 10:40 AM
ఇండియాలో కరోనా కేసులు రోజు రోజుకు తీవ్ర స్థాయిలో పెరుగుతూనే ఉన్నాయి..గత కొన్నిరోజులుగా ప్రపంచంలోనే అత్యధిక రోజువారీ కేసులు నమోదవుతుండగా, తాజాగా లక్ష కేసులకు రెండడుగుల దూరంలో నిలిచాయి. దీంతో దేశంలో 44 లక్షల మార్కును దాటాయి..
దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 95,735 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 44,65,864కు చేరాయి. ఇందులో 9,19,018 యాక్టివ్ కేసులు ఉండగా, 34,71,784 మంది బాధితులు కోలుకున్నారు. నిన్న ఉదయం నుంచి నేటి ఉదయం వరకు కరోనా వల్ల 1172 మంది మరణించారు. ఒక్కరోజులో ఇంత భారీసంఖ్యలో కరోనా బాధితులు మరణించడం ఇదే మొదటిసారి. దీంతో దేశంలో కరోనా మృతుల సంఖ్య 75,062కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.
నిన్న ఒకేరోజు 11,29,756 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎమ్మార్) ప్రకటించింది. దీంతో సెప్టెంబర్ 9 నాటికి దేశవ్యాప్తంగా 5,29,34, 433 నమూనాలను పరీక్షించామని వెల్లడించింది.