దేశంలో మళ్ళీ పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు..గత వారం రోజుల్లో 4 లక్షల పాజిటివ్ కేసులు
By: Sankar Wed, 12 Aug 2020 11:43 AM
భారత్లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 60,963 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 834 మరణాలు సంభవించాయి. దీంతో మొత్తంగా దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 23,29,638కి చేరింది. ఇప్పటి వరకు 46,091 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో 56,110 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 16,39,599 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారంవిడుదల చేసిన హెల్త్ బులిటెన్లో పేర్కొంది..
కాగా, దేశంలో నమోదయిన మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం 27.64గా ఉంది. ప్రస్తుతం రికవరీ రేటు 70.38 శాతం ఉండగా.. మరణాల రేటు 1.98 శాతంగా ఉంది. గడచిన 24 గంటలలో 7,33,449 కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించగా.. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 2,60,15,297 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించారు.
ఇక గత వారం రోజులుగా(ఆగష్టు 4-10) ఇండియాలో రికార్డు స్థాయిలో 4,11,379 మంది కరోనా బారిన పడగా.. 6,251 మంది మహమ్మారి కారణంగా మరణించారు. అదే సమయంలో అమెరికాలో 3,69,575 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 7,232 కరోనా మరణాలు సంభవించాయి. ఇక బ్రెజిల్ విషయానికి వస్తే.. 3,04,535 మందికి వైరస్ సోకగా.. 6,914 మంది కోవిడ్తో మృతి చెందారు. అయితే గత నాలుగు రోజులుగా దేశంలో వరుసగా 60 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నప్పటికీ రికవరీ రేటు 70 శాతంగా ఉండటం భారత్కు సానుకూలాంశమని చెప్పవచ్చు.