Advertisement

చైనా ముప్పుకు చెక్ పెట్టేందుకు భారత్ సిద్ధ౦

By: chandrasekar Tue, 29 Sept 2020 5:20 PM

చైనా ముప్పుకు చెక్ పెట్టేందుకు భారత్ సిద్ధ౦


భారత్ లఢక్ సరిహద్దులో‌ని వ్యూహాత్మక సైనిక శిబిరాల్లో బ్రహ్మోస్, ఆకాష్, నిర్భయ్‌ క్షిపణులని మోహరించింది. చైనా, భారత్ సైన్యం మధ్య సరిహద్దులో ఘర్షణల నేపథ్యంలో టిబెట్, జిన్జియాంగ్‌లోని సైనిక కేంద్రాల్లో 2000 కిలోమీటర్ల లక్ష్యాలను చేధించగల క్షిపణులను చైనా మోహరించింది. ఈ నేపథ్యంలో సూపర్ సోనిక్ బ్రహ్మోస్, సబ్ సోనిక్ నిర్భయ్, ఆకాష్ క్షిపణులను భారత్ మోహరించింది. చైనా నుంచి ఏదైనా ఊహించని పరిస్థితి ఎదురైతే ధీటుగా తిప్పికొట్టేందుకు అన్ని విధాలా భారత్ సిద్ధమైంది. ఎయిర్ టు ఎయిర్, ఎయిర్ టు సర్ఫేస్ బ్రహ్మోస్ క్షిపణులు 300 కిలోల బరువైన ఆయుధాలతో 500 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను చేధిస్తాయి. సుఖోయ్ 30 ఎంకేఐ యుద్ధ విమానాల్లో వినియోగించేందుకు బ్రహ్మోస్ క్షిపణులను లఢక్ సెక్టార్‌తోపాటు నికోబార్ ఎయిర్‌బేస్‌లో మోహరించారు. ఇక సబ్ సోనిక్ క్షిపణి నిర్భయ్ వెయ్యి కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను చేధిస్తుంది. వంద మీటర్ల నుంచి నాలుగు కిలోమీటర్ల ఎత్తు వరకు వీటిని ఉపయోగించవచ్చు. ప్రస్తుతం భూమి నుంచి భూమిపై ప్రయోగించే నిర్భయ్ క్షిపణులను మాత్రమే భారత్ తయారు చేసింది.

ఇక ఆర్మీ ఎక్కువగా వినియోగించే ఆకాష్ క్షిపణులను భారీ సంఖ్యలో మోహరించారు. లఢక్‌ ప్రాంతంలోకి చైనా యుద్ధ విమానాలు ప్రవేశిస్తే వీటితో గట్టిగా బదులిస్తారు. రాడార్ రాజేంద్ర సహాయంతో ఒకేసారి 64 లక్ష్యాలను గుర్తించి ఏక కాలంలో 12 లక్ష్యాలను చేధించే సామర్థ్యం ఆకాష్ సొంతం. యుద్ధ విమానాలు, క్రూయిజ్ క్షిపణులు, బాలిస్టిక్ క్షిపణులతో సహా అన్ని వైమానిక లక్ష్యాలను ఇది ధీటుగా ఎదుర్కోగలదు. మరోవైపు ప్రస్తుతం ఆక్రమిత అక్సాయ్ చిన్‌లో చైనా వైమానిక కార్యకలాపాలు తక్కువ స్థాయిలోనే ఉన్నాయి. అయితే కరాకోరం పాస్ సమీపంలోని డౌలెట్ బేగ్ ఓల్డి సెక్టార్ అంతటా పీఎల్ఏ వాయు కార్యకలాపాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చైనా నుంచి ఎదురయ్యే ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొనేందుకు బ్రహ్మోస్, ఆకాష్, నిర్భయ్‌ క్షిపణులను భారత్ సిద్ధం చేసింది. ఇప్పటికే చలికాలంలో సైతం పనిచేసే యుద్ధ ట్యాంకులు, వాహనాలను లఢక్ సరిహద్దులో ఆర్మీ మోహరించిన సంగతి తెలిసిందే.

Tags :
|
|
|
|

Advertisement