ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో సభ్యదేశంగా భారత్ ఎంపిక
By: chandrasekar Fri, 19 June 2020 3:57 PM
ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో
తాత్కాలిక సభ్యత్వం కోసం జరిగిన ఎన్నికల్లో భారత్ ఘన విజయం సాధించింది.
ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ఈ ఎన్నికల ప్రక్రియ నిర్వహించారు.
మొత్తం 193 సభ్యదేశాలున్న జనరల్ అసెంబ్లీలో భారత్కు
అనుకూలంగా 184 ఓట్లు
లభించాయి. 2021-22
కాలానికి అధిక మద్దతుతో ఐరాస సభ్యదేశాలు ఇండియాను ఎన్నుకున్నాయని ఐక్యరాజ్య
సమితి భారత శాశ్వత ప్రతినిధి టీఎన్ గురుమూర్తి తెలిపారు.
ఐక్యరాజ్య సమితి భద్రతా
మండలిలో సభ్యదేశంగా భారత్ ఎంపిక కావడం ఇది ఎనిమిదోసారి.
ఐరాస భద్రతా మండలిలో
శాశ్వత సభ్యదేశంగా ఎంపికయ్యేందుకు భారత్ ఎప్పటినుంచో ప్రయత్నం చేస్తున్నది.
అయితే, మండలిలోని నాలుగు శాశ్వత సభ్యదేశాలు ఇండియాకు అనుకూలంగా
ఉన్నప్పటికీ చైనా వ్యతిరేకిస్తుండటంతో భారత్ శాశ్వత సభ్యదేశంగా ఎంపిక
కాలేకపోతున్నది.
ఐక్యరాజ్య సమితి భద్రతా
మండలిలో మొత్తం ఐదు శాశ్వత సభ్యదేశాలు, 10
తాత్కాలిక సభ్యదేశాలు ఉంటాయి. ప్రతి ఏడాది ఓటింగ్ ద్వారా తాత్కాలిక సభ్యదేశాలను
ఎన్నుకుంటారు. ఆసియా పసిఫిక్ వర్గానికి చెందిన సభ్యదేశంగా భారత్ ఎంపికయ్యింది.