చైనా కవ్వింపు కారణంగా నియంత్రణ రేఖ వెంబడి రష్యన్ క్షిపణులను మొహరిస్తున్న భారత్
By: chandrasekar Tue, 25 Aug 2020 8:35 PM
చైనా కవ్వింపు కారణంగా నియంత్రణ రేఖ వెంబడి రష్యన్ క్షిపణులను భారత్ మోహరిస్తున్నది. చైనా సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకుంటున్నాయి. ఓవైపు చర్చలు కొనసాగిస్తూనే మరోవైపు భారత్పై కత్తులు దూస్తున్న డ్రాగన్ దేశం తాజాగా హెలికాఫ్టర్లతో కవ్వింపు చర్యలకు దిగుతోంది. వీటికి అడ్డుకట్ట వేసేందుకు ఇప్పటికే పలు యుద్ధ సన్నాహాలు చేస్తున్న భారత్ తాజాగా భుజాలపై ఉంచి పేల్చగలిగే రష్యన్ క్షిపణులను సరిహద్దుల్లో మోహరిస్తోంది.
నియంత్రణ రేఖ దాటి చైనా హెలికాఫ్టర్లు వస్తే పేల్చేసేందుకు వీలుగా ఈ రష్యన్ మేడ్ క్షిపణులను అక్కడికి తరలిస్తోంది. భారత గగన తల నియంత్రణలను ఉల్లంఘించి చైనా హెలికాఫ్టర్లు కానీ, విమానాలు కానీ చొరబడితే వెంటనే పేల్చేసేందుకు వీలుగా సైన్యం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇప్పుడు క్షిపణులతో బలగాలు సరిహద్దుల్లో నిరంతరం పహారా కాస్తున్నాయి. ఈ రష్యన్ తయారీ క్షిపణులను సైన్యంతో పాటు వాయుసేన కూడా ఉపయోగిస్తోంది.
మన దేశ సరిహద్దుల సమీపంలోకి వచ్చే ప్రత్యర్ధి - చైనా దేశాల విమానాలు, హెలికాఫ్టర్లను అక్కడికక్కడే కూల్చివేసేందుకు ఇవి ఉపయోగపడతాయి. వీటితో పాటు చైనా ముష్కరుల జాడను కనిపెట్టేందుకు నిఘా రాడార్లు, ఉపరితలంపై నుంచి ఆకాశంలోని ప్రయోగించే మిసైళ్లను కూడా సైన్యం సరిహద్దులకు తరలిస్తోంది. గతంలో ఘర్షణలు చోటు చేసుకున్న గల్వాన్ లోయతో పాటు కీలక ప్రాంతాల్లో చైనా హెలికాఫ్టర్ల కదలికలు పెరిగాయని భావిస్తున్న కేంద్రం కొంతకాలంగా మోహరింపులు పెంచుతోంది.
నియంత్రణ రేఖ వెంబడి జరిగిన గొడవల్లో భాగంగా చైనా ఆర్మీ తాజాగా కొన్ని ప్రాంతాల్లో ఎయిర్ బేస్లను పెంచుతోందన్న సమాచారంతో నిఘా పెంచాల్సిన అవసరం కూడా పెరిగిందని సైనిక వర్గాలు చెబుతున్నాయి. ప్రత్యర్థి ఎటువంటి కవ్వింపులకు దిగినా వారిపై కఠిన మైన చర్యలు తీసుకోవడానికి భారత్ తన ఆయుధాలను సరిహద్దులవద్ద మోహరిస్తూ వుంది.