ఎనిమిదో సారి భారత్-చైనా కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చలు
By: chandrasekar Fri, 06 Nov 2020 6:16 PM
సరిహద్దుల్లో తూర్పు లడఖ్ ఉద్రిక్తతల నేపధ్యంలో పలుసార్లు దౌత్య, సైనిక
అధికారుల మధ్య చర్చలు జరిగినా ఫలితం మాత్రం శూన్యమే. తాజాగా, ఇరు
దేశాల కార్ప్స్ కమాండర్ స్థాయి అధికారుల మరోసారి సమావేశమయ్యారు. వాస్తవాధీన రేఖ
వెంబడి చూషుల్ వద్ద ఎనిమిదో సారి భారత్-చైనా కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చలు
శుక్రవారం ఉదయం 9.30 గంటలకు ఈ చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది మే మొదటి
వారంలో భారత్ భూభాగంలోకి చైనా సైన్యం చొరబడటంతో అప్పటి నుంచి ఆరు నెలలుగా
ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. జూన్ 15న గాల్వన్ లోయ వద్ద చైనా సైన్యంతో జరిగిన ఘర్షణలో 20 మంది
భారత జవాన్లు అమరులయ్యారు. చైనావైపు కూడా భారీగా ప్రాణనష్టం సంభవించినా ఆ దేశం
మాత్రం అధికారంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. ఈ ఘటనకు ముందే ఇరు దేశాల మధ్య తొలిసారి
చర్చలు జరగడం గమనార్హం.
దేశ సౌరభౌమత్వం, సమగ్రత
విషయంలో రాజీ ప్రసక్తేలేదని, ఈ విషయంలో ఎంతవరకైనా వెళ్తామని కేంద్ర రక్షణ మంత్రి
రాజ్నాథ్ సింగ్ గురువారం పునరుద్ఘాటించారు. అటు చైనా కూడా రాజీకి
ప్రయత్నిస్తున్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. గతవారం చైనా విదేశాంగ మంత్రి
మాట్లాడుతూ.. సరిహద్దుల్లో ప్రస్తుతం పరిస్థితి స్థిరంగానే ఉందని, చర్చలు, సంప్రదింపుల
ద్వారా పరిష్కారానికి ఇరు దేశాలూ ప్రయత్నిస్తున్నాయని తెలిపారు. వివాదాస్పద
ప్రాంతాల నుంచి వైదొలగాలని భారత్ పదే పదే హెచ్చరిస్తున్నా, చైనా
సైన్యం మాత్రం విస్తరణవాదాన్ని వీడటం లేదు. గల్వాన్ లోయ, పాంగాంగ్
సరస్సు, ఇతర
ప్రాంతాల్లో యథాపూర్వ స్థితిని పునరుద్ధరించాల్సిందేనని, చైనా
బలగాలు వెనక్కి వెళ్లాల్సిందేనని భారత్ స్పష్టం చేస్తోంది. జూన్ 22న
జరిగిన చర్చల్లో ఇరు దేశాల మధ్య కుదిరిన అవగాహనకు కట్టుబడి ఉండాలని భారత్
ఉద్ఘాటించింది.