- హోమ్›
- వార్తలు›
- ఇండియా-చైనా సరిహద్దులో రోడ్డు మార్గం మూడేళ్లలో పూర్తి చేస్తాం: బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ప్రతినిధి
ఇండియా-చైనా సరిహద్దులో రోడ్డు మార్గం మూడేళ్లలో పూర్తి చేస్తాం: బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ప్రతినిధి
By: chandrasekar Fri, 12 June 2020 6:35 PM
ఇండియా-చైనా సరిహద్దులో
రోడ్డు మార్గం నిర్మాణ పనులను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. ఉత్తరాఖండ్లోని
ఎత్తైన హిమాలయ పర్వత ప్రాంతాలకు హెలికాప్టర్ల ద్వారా భారీ యంత్రాలను చేరవేసింది. పర్వత ప్రాంతాల్లో పెద్ద పెద్ద కొండరాళ్లను తొలిచే
ప్రక్రియ ప్రారంభమైంది. ఉత్తరఖండ్లోని జోహర్ లోయలో 65
కి.మీ. మేర నిర్మిస్తున్న ఈ రోడ్డు మార్గంలో 22 కి.మీ. దూరం పాటు కొండలే ఉన్నాయి. వీటన్నింటిని
తొలిచి మరో మూడేళ్లలో రోడ్డు మార్గం పూర్తి చేస్తామని బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్
ప్రతినిధి తెలిపారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత
సరిహద్దులో రహదారుల నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
సైనిక కార్యకలాపాల కోసం
వినియోగించడానికి, అత్యవసర సమయాల్లో సైనికులు, ఔషధాల
తరలింపు, యుద్ధ
సామగ్రి తరలింపు తదితరాల కోసం వ్యూహాత్మకంగా ఈ రహదారుల నిర్మాణం చేపట్టింది. ముఖ్యంగా
చైనా సరిహద్దు వెంట ఈ రోడ్ల నిర్మాణంపై ప్రధానంగా దృష్టి సారించింది. టిబెట్లోని
మానససరోవరాన్ని కలుపుతూ భారత్ నిర్మించిన రహదారిని ఇటీవల రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్
సింగ్ ప్రారంభించిన సంగతి తెలిసిందే.
ఉత్తరాఖండ్లో
మున్సియారి-బుగ్దియార్-మిలామ్ రహదారి నిర్మాణ పనులను కేంద్ర ప్రభుత్వం వేగవంతం
చేసింది. 65 కి.మీ. పొడవైన ఈ రహదారి నిర్మాణ పనుల కోసం భారీ
యంత్రాలను తరలించడానికి 2019లో పలుమార్లు ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. తాజాగా
భారీ యంత్రాలు, కొండలను తొలిచే యంత్రాలు, పరికరాలను
మోసికొచ్చిన హెలికాప్టర్లు హిమాలయ కొండల్లో విజయవంతంగా ల్యాండ్ అయ్యాయి. లాప్సా
కొండ ప్రాంతానికి ఈ యంత్రాలను చేర్చినట్లు బీఆర్ఓ చీఫ్ ఇంజినీర్ బిమల్ గోస్వామి
తెలిపారు.
కొండలను తొలిచే భారీ
యంత్రాలు లేకపోవడం వల్లే మున్సియారి-బుగ్దియార్-మిలామ్ రోడ్డు నిర్మాణ పనుల్లో
జాప్యం జరిగిందని బిమల్ గోస్వామి చెప్పారు. ఉత్తరాఖండ్లోని పితోర్గర్ జిల్లాలో
చేపట్టిన ఈ భారీ రోడ్డు మార్గం భారత్-చైనా సరిహద్దులోని చివరి సైనిక పోస్టును
కలుపుతూ నిర్మిస్తుండటం విశేషం.
ఈ రహదారి నిర్మాణ పనులను 2010లో
ప్రారంభించినట్లు బిమల్ గోస్వామి తెలిపారు. ఈ భారీ ప్రాజెక్టు కోసం నాటి ప్రభుత్వం
రూ.325
కోట్లు కేటాయించిందని చెప్పారు. 40 కి.మీ. మార్గంలో ఇరువైపుల నుంచి రోడ్డు నిర్మాణ
పనులు కొనసాగుతున్నాయని అనుకున్న సమయానికి రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేస్తామని
ఆయన పేర్కొన్నారు. ఓ వైపు లద్దాఖ్లో చైనా సైన్యంతో ఘర్షణలకు ముగింపు పలుకుతూనే
మరోవైపు కీలకమైన రహదారి నిర్మాణ పనులను భారత్ వేగవంతం చేసున్నది.