గులాబీ టెస్టులో మెరిసేది ఎవరో !
By: Sankar Wed, 16 Dec 2020 11:21 AM
ఆస్ట్రేలియాతో రేపటి నుంచి నాలుగు టెస్టుల సిరీస్ లో టీమిండియా బరిలోకి దిగనుంది...అయితే తొలి టెస్టులోనే టీమిండియాకు కఠిన పరీక్షా ఎదురుకానుంది...అడిలైడ్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ డే అండ్ నైట్ పద్దతిలో పింక్ బాల్ తో జరగనుంది..అయితే ఇప్పటివరకు ఆస్ట్రేలియాలో జరిగిన ఏడు పింక్ బాల్ టెస్టులలో ప్రత్యర్ధులు ఆస్ట్రేలియాకు కనీసం పోటీ కూడా ఇవ్వకుండానే ఓడిపోయారు..ఇక మరోవైపు టీమిండియా తమ కెరీర్ లో ఒకే ఒక్క పింక్ బాల్ టెస్ట్ ఆడింది ..అది కూడా స్వదేశంలో బలహీన ప్రత్యర్థి బాంగ్లాదేశ్ మీద ..దీనితో రేపటి మ్యాచ్ లో టీమిండియా ఎలా ఆడుతుంది అనేది ఆసక్తి నెలకొన్నది...
పింక్ టెస్టుల్లో ప్రత్యర్థి రికార్డు ఘనంగా ఉన్నా.. ప్రస్తుత ఫామ్ను బట్టి చూస్తే మొగ్గు మనవైపే కనిపిస్తున్నది. మయాంక్, గిల్, కోహ్లీ, రహానే, పుజారా, విహారితో టీమ్ఇండియా బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది. మునుపెన్నడూ లేని విధంగా పేస్ రాటుదేలడం భారత్కు సానుకూలాంశం. విదేశీ గడ్డపై విజయాలు సాధించాలంటే పేసర్లు రాణించడం తప్పనిసరి. 20 వికెట్లు పడగొట్టే సత్తా మా బౌలర్లకు ఉందని వైస్ కెప్టెన్ రహానే విశ్వాసం వ్యక్తం చేస్తున్నాడు.
బుమ్రా, షమీ, ఉమేశ్, అశ్విన్ స్థాయికి తగ్గట్లు రాణిస్తే కంగారూలకు ఇబ్బందులు తప్పకపోవచ్చు. గత పర్యటనలో ఆసీస్ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించిన పుజారా అదే ఫామ్ కొనసాగిస్తే భారీ స్కోర్లు ఖాయమే. పరిమిత ఓవర్ల క్రికెట్లో తన స్థాయికి తగ్గ ఇన్నింగ్స్ ఆడని కెప్టెన్ విరాట్ కోహ్లీ.. చివరి మూడు టెస్టులకు అందుబాటులో ఉండటం లేదు. పితృత్వ సెలవులపై స్వదేశానికి తిరిగి వచ్చేయడానికి ముందే అదిరే ఇన్నింగ్స్తో సిరీస్లో జట్టుకు ఆధిక్యం అందించాలని భావిస్తున్నాడు.
ఇక ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ మంగళవారం జట్టు ప్రాక్టీస్లో పాల్గొనలేదు. సహచరులతో కలిసి మైదానంలోకి వచ్చిన స్మిత్.. పది నిమిషాల్లోనే తిరిగి డ్రెస్సింగ్ రూమ్కు చేరుకున్నాడు. గురువారం నుంచి గులాబీ టెస్టు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ అంశం ఆసీస్ను తీవ్రంగా కలవరపెడుతున్నది. స్మిత్ ఫిట్నెస్పై ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల కాకున్నా.. ఆసీస్ మీడియా మాత్రం బుధవారం అతడు నెట్స్లో బ్యాటింగ్ చేస్తాడని పేర్కొంది. ఇప్పటికే గాయాల కారణంగా వార్నర్, పుకోస్కీ దూరం కాగా.. స్మిత్ కూడా తొలి టెస్టుకు అందుబాటులో లేకుంటే ఆసీస్కు కష్టాలు తప్పకపోవచ్చు.