భారత్ లో కరోనా సెకండ్ వేవ్ పై పెరుగుతున్న భయాలు..
By: Sankar Tue, 27 Oct 2020 7:37 PM
కరోనా సెకండ్వేవ్ మొదలయ్యే అవకాశాలున్నాయని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. వచ్చే నెల మూడు, నాలుగు వారాల్లో లేదా డిసెంబర్ మొదటి వారంలో కోవిడ్ ఉధృతి మళ్లీ పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. ఏ మహమ్మారి అయినా సెకెండ్వేవ్లో వ్యాధి తీవ్రత హెచ్చుగా ఉంటుందంటున్నారు.
ఇప్పటికే ఫ్రాన్స్, అమెరికా, తదితర పశ్చిమదేశాల్లో కోవిడ్ సెకెండ్వేవ్ కేసులు, ప్రభావం క్రమంగా పెరుగుతున్నట్టుగా వార్తలొస్తున్నాయి. మనదేశంలో తొలిదశ కరోనా వ్యాప్తి (ఫస్ట్వేవ్) ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పట్టడం మొదలైందని, త్వరలోనే సెకెండ్వేవ్ను ఎదుర్కొనేందుకు సిద్ధం కావాల్సి ఉంటుందనే అభిప్రాయం వైద్యవర్గాల్లో వ్యక్తమవుతోంది.
పండుగల సీజన్లో ప్రజలు పెద్దసంఖ్యలో బయటకు వస్తున్నారు. కలుసుకోవడం, గుంపులుగా చేరడం పెరిగినందున ఇప్పుడు అప్రమత్తత అవసరం. ఇంకా వ్యాక్సిన్ అందుబాటులోకి రానందున జాగ్రత్తలు ముఖ్యం. కొందరు కరోనా అధ్యాయం ముగిసిందనే భావనలో మాస్క్లు ధరించడం లేదు. సామాజిక దూరం, శానిటైజేషన్ లాంటి జాగ్రత్తలు పాటించడం మానేశారు..
దీనివల్ల మళ్లీ కరోనా వైరస్ వ్యాప్తి పెరిగే ప్రమాదముంది. పండుగల సందర్భంగా పెద్దసంఖ్యలో ఒకచోట గుమికూడటం, చిన్న గుంపులుగా ఒక దగ్గర చేరడం చేయొద్దు. ఇవే కొత్త హాట్స్పాట్లుగా మారాయనే విషయాన్ని గ్రహించాలి. ఇళ్లచుట్టూ పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. వర్షాలు తగ్గాక అక్కడక్కడా డెంగీ కేసులు రిపోర్ట్ అవుతున్నాయి. దీనితో సరైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అని వైద్యులు అంటున్నారు...