కాళేశ్వరం ప్రాజెక్టు కారణంగా అధికమించిన మత్స్య సంపద
By: chandrasekar Wed, 10 June 2020 6:53 PM
తెలంగాణాలో మత్స్య సంపద
అనతి కాలంలో చాలా అభివృద్ధిని సాధించింది. కాళేశ్వరం ప్రాజెక్టు కల సాకారం కావడంతో
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జలకళ ఉట్టిపడుతున్నది. గోదావరి జలాలను ఒడిసిపట్టి
రిజర్వాయర్లు, గొలుసు చెరువులను నింపుతుండటంతో రైతులు ఆనంద పరవశం
చెందుతున్నారు. నిండు వేసవి రోజుల్లో ఎన్నో చెరువులు మత్తడి దుంకుతుండటంతో గ్రామీణ
ప్రజల ఆనందానికి అవధులు లేకుండాపోయింది. గోదావరి జలాలతో ఒక్క రైతులే కాకుండా
మత్స్యకారులు కూడా ఎంతో లాభపడుతున్నారు.
రిజర్వాయర్లు, చెరువులు
సమృద్ధిగా నీటితో నిండివుండటంతో గతంలో ఎనాడూ లేనంతగా చేపల ఉత్పత్తి జరుగుతున్నది.
మృగశిరకార్తె ప్రారంభమై వర్షాలు పడే రోజులు దగ్గరపడే సమయంలో చేపలు పట్టుకొంటూ
మత్స్యకారులు పరవశించి పోతున్నారు. తెలంగాణ మత్స్యకారుల చేపలు పట్టుకొని ఎంతగా
ఉప్పొంగిపోతున్నారో మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా కండ్లకు కట్టినట్లుగా
చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క ప్రధాన ప్రయోజనాల్లో మత్స్య సంపద అభివృద్ధి
కూడా ఒకటి అని, మత్స్యరంగంలో సృష్టిస్తున్న పెద్ద విజృంభణగా
అభివర్ణించారు. రాష్ట్రంలో నీటి లభ్యత ఉండటం, ప్రభుత్వ పరంగా మద్దతు లభించడంతో చేపలు, రొయ్యల
ఉత్పత్తి స్థిరంగా అభివృద్ధి చెందేందుకు దారితీస్తుందని చెప్పారు.
ఈ ఏడాది తెలంగాణ
మత్స్యశాఖ 3.2 లక్షల టన్నుల మంచినీటి చేపలను ఉత్పత్తి చేసిందని
అలాగే, 15 వేల
టన్నుల మంచినీటి రొయ్యలను దాటి ఉత్పత్తి జరుగుతున్నదని హర్షం వ్యక్తంచేశారు.
మత్స్యకారులకు చేపలు పట్టేందుకు కావాల్సిన సామగ్రి, పడవలు, రిటైల్
విక్రయాల కోసం వాహనాలను సమకూర్చడం వంటి చర్యలను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు
నాయకత్వంలో అందజేస్తూ నిరంతరం శ్రమిస్తున్న మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్కు
అభినందనలు తెలుపుతున్నట్టు మంత్రి కేటీఆర్ చెప్పారు. వివిధ జిల్లాల్లో
మత్స్యకారులు చేపలు పట్టుకొని సంతోషం వ్యక్తం
చేస్తున్న పలువురి ఫొటోలను మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు.