కేంద్ర మంత్రి వర్గంలో ‘పదవుల బేరం’ కోసమే జగన్ ఢిల్లీ వెళ్లారేమో: మాజీ మంత్రి
By: chandrasekar Tue, 06 Oct 2020 1:12 PM
ఆంధ్రప్రదేశ్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం మధ్యాహ్నం కడప నుంచి గన్నవరం
చేరుకుని అక్కడి నుంచి నేరుగా ఢిల్లీ విమానం ఎక్కారు. ఢిల్లీ చేరుకున్న తర్వాత
నేరుగా తన నివాసానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి జగన్ వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్
రెడ్డి, భరత్, వెంకటరమణ, బాలశౌరి ఉన్నారు. అధికారిక షెడ్యూల్ ప్రకారం మంగళవారం ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో
సీఎం జగన్ సమావేశం కానున్నారు.
తెలుగు దేశం పార్టీ
సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సీఎం జగన్
ఢిల్లీ పర్యటనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రి వర్గంలో ‘పదవుల బేరం’
కోసమే జగన్ ఢిల్లీ వెళ్లారేమో అని వ్యాఖ్యానించారు. ‘‘25 మంది
ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా తెస్తామన్నారు. కేంద్రం మెడలు వంచి హోదా సాధిస్తామని
ప్రగల్భాలు పలికారు. ఇప్పుడు కేంద్రానికి మన అవసరం లేదని చేతులెత్తేశారు. నమ్మి
గెలిపించిన ప్రజలకు నమ్మక ద్రోహం చేశారు. ఢిల్లీ వెళ్లి వ్యక్తిగత పనులు, కేసులు
గురించే జగన్ చర్చిస్తారు. అందుకే జగన్కు వివరాలు వెల్లడించే ధైర్యం లేదు.
ఇప్పుడు అయినా ఢిల్లీ మీడియా ముందు ఏం చర్చించారో చెప్పే దమ్ము, ధైర్యం
జగన్కు ఉందా?’’ అని ఉమ ప్రశ్నించారు.
సీఎం జగన్ ఢిల్లీ
పర్యటనపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, వివిధ
ప్రాజెక్టుపై చర్చించేందుకు జగన్ ఢిల్లీ వెళ్తున్నట్లు కొందరు చెబుతుండగా, కచ్చితంగా
కేంద్ర ప్రభుత్వంలో చేరడంపై చర్చించేందుకే వెళ్తున్నారంటూ మరికొందరు
విశ్లేషిస్తున్నారు. తాజాగా, మాజీ మంత్రి దేవినేని ఉమా సైతం కేంద్ర మంత్రి పదవులపై
చర్చించేందుకే జగన్ ఢిల్లీ వెళ్లారంటూ
వ్యాఖ్యానించారు. సీఎం జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లినప్పుడల్లా ఎన్డీఏలో
వైసీపీ చేరడంపై ఊహాగానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి.