Advertisement

రైతుల ఖాతాల్లో ఈ నెల రూ. 4,000 జమ...

By: chandrasekar Sat, 24 Oct 2020 1:52 PM

రైతుల ఖాతాల్లో ఈ నెల రూ. 4,000 జమ...


ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కరోనా కష్టకాలంలో కూడా సంక్షేమ పథకాల విషయంలో వెనక్కుతగ్గడం లేదు. కరోనా లాక్ డౌన్ సమయంలోనూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేశారు. తాజాగా, ఇచ్చిన హామీ ప్రకారం రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేయబోతున్నారు. ఈ నెల 27వ తేదీన రైతు భరోసా డబ్బులు వారి ఖాతాల్లో జమ చేస్తున్నట్లు సీఎం జగన్ ఇదివరకే‌ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా, ఈ విషయంలో మరోసారి క్లారిటీ ఇచ్చారు. తాడేపల్లిలో స్టేట్ లెవల్‌ బ్యాంకర్స్‌ కమిటీతో సీఎం జగన్ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఆర్థిక రంగానికి వ్యవసాయ రంగం వెన్నుముక అని, రాష్ట్రంలో దాదాపు 62 శాతం మంది ఈ రంగంపై ఆధారపడ్డారని అన్నారు. రైతులకు పెట్టుబడి సాయం కింద ఏటా రూ. 13,500 ఇస్తున్నట్లు వివరించారు. ఖరీఫ్‌ (జూన్‌)లో 7,500, రబీ (అక్టోబర్‌)లో రూ.4 వేలు, పంట చేతికొచ్చే సంక్రాంతి పండుగ సమయంలో మరో రూ. 2 వేలు రైతు భరోసా కింద ఆర్థిక సాయం చేస్తున్నట్లు తెలిపారు. తద్వారా ఈ నెల 27న రైతుల ఖాతాల్లో రూ. 4 వేలు జమ చేయబోతున్నట్లు చెప్పారు.

రాష్ట్రంలో 10,600కు పైగా ఆర్బీకే కేంద్రాలు ఏర్పాటు చేశామని, పంటల బీమా, సున్నా వడ్డీ రుణాల కోసం ఈ-క్రాపింగ్ తప్పనిసరి అని సీఎం జగన్ తెలిపారు. గతేడాది ధరల స్థిరీకరణ నిధి కింద రూ.3,200 కోట్లతో పంటలు కొన్నామని, ఈ ఏడాది రూ. 3,500 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. ప్రతి గ్రామంలో గోడౌన్‌లు, మండల కేంద్రాల్లో కోల్డ్‌ స్టోరేజ్‌లు ఏర్పాటు చేయబోతున్నట్లు వివరించారు. ప్రతి గ్రామంలో జనతా బజార్లు ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. 2020–21 ఆర్థిక సంవత్సరంలో రుణాల లక్ష్యం 2,51,600 కోట్లు (గతేడాదితో పోలిస్తే 9.78 శాతం ఎక్కువ) వ్యవసాయ రంగానికి రూ.1,28,660 కోట్ల రుణం (గతేడాదితో పోలిస్తే 11.9 శాతం పెంపు) సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈలు)కు రూ. 39,600 కోట్ల రుణాలు (గతేడాదితో పోలిస్తే 10 శాతం పెంపు).

Tags :
|

Advertisement