హాథ్రస్ లో బాధిత కుటుంబం గ్రామాన్ని వీడి వెళ్ళిపోనున్నట్టు వెల్లడి
By: chandrasekar Thu, 08 Oct 2020 09:30 AM
హాథ్రస్ లో చోటుచేసుకున్న
సంఘటనలో బాధిత కుటుంబం గ్రామాన్ని వీడి
వెళ్ళిపోనున్నట్టు వెల్లడించారు. దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన, హాథ్రస్
దళిత యువతిపై సామూహిక అత్యాచారం, హత్య కేసులో బాధితురాలి కుటుంబ సభ్యులు, ఇప్పుడు
ఊరు విడిచి వెళ్ళే దయనీయమైన పరిస్థితి ఏర్పడింది. తమ బిడ్డకి ఈ దారుణం జరిగిన
తరువాత తాము భయంగుప్పిట్లో బతుకుతున్నామని, ఊరు విడిచి వెళ్ళిపోవడం తప్ప మరో గత్యంతరం లేదని
బాధితురాలి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ ఘటన తరువాత తమ
కుటుంబానికి సాయం చేసేందుకు గ్రామంలోని ఏ ఒక్కరూ ముందుకు రాలేదని బాధితురాలి
తండ్రి, సోదరుడు
మీడియా ముందు వాపోయారు.
ఈ సంఘటన తరువాత తమ
కుటుంబాన్ని గ్రామస్తులు పదే పదే నిందిస్తోన్నారని, అందుకే భోల్గరీ
గ్రామాన్ని వీడి వెళ్ళిపోనున్నట్టు వారు వెల్లడించారు. ఈ ఘటన తరువాత గత కొద్ది
రోజులుగా తాము భయంతో బతుకుతున్నామని, ఇక ఇక్కడ బతికేందుకు అవకాశమేలేదని, ఎక్కడికైనా
దూరంగా వెళ్ళిపోయి, ఎవరైనా తమ బంధువుల ఇంట్లో తలదాచుకోవాలని
భావిస్తున్నట్టు బాధితురాలి తండ్రి తెలిపారు. పరిస్థితులు భయంకరంగా ఉన్నాయని
అందుకే గ్రామం వీడిపోవాలనుకుంటున్నట్టు బాధితురాలి కుటుంబసభ్యులు చెప్పారు.
గ్రామంలోని ఎవ్వరూ తమ కుటుంబాన్ని పట్టించుకోలేదని ఆమె సోదరుడు ఆవేదన వ్యక్తం
చేశారు. ప్రస్తుతం వీరిపై వ్యతిరేకత పెరిగినట్లు తెలిపారు.