నియంత్రిత పద్ధతిలో పంటల సాగు విధానం అమలు: సీఎం కేసీఆర్
By: chandrasekar Thu, 28 May 2020 4:25 PM
సూచించిన పంటకు
సంబంధించిన విత్తనాలను శుక్రవారం రాత్రిలోగా గ్రామాల్లో అందుబాటులో ఉండేలా చూడాలని
అధికారులకు సీఎం కేసీఆర్ చెప్పారు. నియంత్రిత పద్ధతిలో పంటల సాగు విధానం అమలు
కావడానికి వీలుగా ఏ క్లస్టర్లో ఏ పంట వేయాలనే విషయంలో అధికారులు రైతులకు వెంటనే
తగు సూచనలు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. సూచించిన పంటకు సంబంధించిన
విత్తనాలను శుక్రవారం రాత్రిలోగా గ్రామాల్లో అందుబాటులో ఉండేలా చూడాలని చెప్పారు.
వ్యవసాయ శాఖపై
ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. మంత్రి నిరంజన్
రెడ్డి, సిఎస్ సోమేశ్ కుమార్, రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్
రెడ్డి, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి జనార్థన్ రెడ్డి, వ్యవసాయ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రవీణ్ రావు, సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి కేశవులు
పాల్గొన్నారు. వానాకాలంలో పంటల సాగు, విత్తనాలు-
ఎరువుల లభ్యత, పంటల
కొనుగోళ్లు తదితర అంశాలపై ముఖ్యమంత్రి సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి
కేసీఆర్ పలు ఆదేశాలు జారీ చేశారు. పలు సూచనలు చేశారు.
మార్కెట్లో డిమాండ్ ఉన్న
పంటలను వేయాలని రైతులకు ప్రభుత్వం సూచించింది. గత వర్షాకాలం వేసిన పంటలతో పోలిస్తే
పెద్దగా మార్పులేమీ లేవు. ఈ వర్షాకాలంలో మక్కలు వద్దని మాత్రమే చెప్పాం. మక్కల
స్థానంలో కందులు లేదా పత్తి వేయమని కోరాం. గత ఏడాది వర్షాకాలం లాగానే ఈసారి కూడా 40 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయాలని చెప్పాం. కాకపోతే
మార్కెట్లో డిమాండ్ కలిగిన వరి వంగడాలను ప్రభుత్వం సూచించిన ప్రకారం వేయమన్నాం. గత
ఏడాది 53 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగు చేశారు. ఈ సారి మరో 10-15 లక్షలు పెంచమన్నాం. మిగతా పంటల విషయంలో ఎలాంటి
మార్పులు సూచించలేదు. కొద్దిపాటి మార్పులే కాబట్టి రైతులు కూడా సంపూర్ణంగా
సహకరించడానికి ముందుకొస్తున్నారు.
ఏ క్లస్టర్లో ఏ పంట
వేయాలనే విషయంలో నిర్ణయం జరిగింది. ఈ నిర్ణయాలను రైతులకు చేరవేయాలి. జిల్లాల
వారీగీ తయారు చేసిన ప్రణాళికను జిల్లాలకు వెంటనే పంపాలి. గురువారం రాష్ట్ర
వ్యాప్తంగా జిల్లా స్థాయిలో అధికారులు సమావేశం అవ్వాలి. జిల్లా వ్యవసాయాధికారులు
మండల వ్యవసాయాధికారులకు క్లస్టర్ల వారీగా రూపొందిన ప్రణాళిక ఇవ్వాలి. ఆ మరుసటి
రోజు మండలాల్లో వ్యవసాయ విస్తరణాధికారుల సమావేశం నిర్వహించాలి. క్లస్టర్ల వారీగా ఏ
పంట ఎంత వేయాలో వివరించాలి. తర్వాత ఎఇవోలు రైతులకు వివరించాలి. సూచించిన ప్రకారం
పంటలు వేసే విధంగా రైతులను సమన్వయ పరచాలి.
క్లస్టర్ల వారీగా ఏ పంట
ఎంత వేయాలో నిర్ణయం జరిగింది కాబట్టి, దానికి
అనుగుణంగా గ్రామాల్లో విత్తనాలను అందుబాటులో ఉంచాలి. శుక్రవారం రాత్రిలోగా అన్ని
రకాల విత్తనాలు రైతులకు అందుబాటులో ఉండాలి. కల్తీ విత్తనాలు, నకిలీ విత్తనాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. నిఘా
పెంచాలి. ఎవరైనా కల్తీ విత్తనాలు అమ్ముతున్నట్లు తెలిస్తే, వెంటనే ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలి.
మే 31 వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు నడపాలి. రైతులు కూడా
ఆలోగానే తమ ధాన్యం అమ్ముకోవాలి. 31
తర్వాత కొనుగోలు కేంద్రాలు నిలిపివేయాలి. వ్యవసాయ శాఖ అధికారులు, రైతుబంధు సమితులు జూన్ 1 నుంచి వర్షాకాలం పంటల సాగుపై దృష్టి
కేంద్రీకరించాలి.