దూసుకొస్తున్న మరోక తుఫాన్ ...కేరళలో పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ
By: Sankar Wed, 02 Dec 2020 6:03 PM
నివర్ తుఫాన్ను మర్చిపోకముందే బంగాళాఖాతంలో ఏర్పడ్డ మరో తుఫాన్ బురేవి ముంచుకొస్తున్నది. బుధవారం సాయంత్రం ట్రింకోమలి సమీపంలో శ్రీలంక తీరాన్ని దాటిన బురేవి భారత్ వైపు దూసుకొస్తున్నది.
గురువారం ఉదయానికి ఈ తుఫాన్ గల్ఫ్ ఆఫ్ మన్నార్లోకి ప్రవేశిస్తుందని భారత వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేస్తున్నారు. శుక్రవారం తెల్లవారుజాముకల్లా దక్షిణ తమిళనాడులోని కన్యాకుమారి, పంబన్ ప్రాంతాల మధ్య బువేరి తుఫాన్ తీరాన్ని దాటే అవకాశం ఉందని తెలిపారు.
కాగా, బువేరి తుఫాన్ నేపథ్యంలో భారత్ వాతావరణ కేంద్రం కేరళలోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీచేసింది. తుఫాన్ ప్రభావంతో డిసెంబర్ 3న కేరళ తీరప్రాంతంలోని తిరువనంతపురం, కొల్లాం, పథనంథిట్ట, అలప్పుజ జిల్లాల్లో భారీ వర్షాలతోపాటు, బలమైన గాలులు వీచే అవకాశం ఉందని ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఆయా జిల్లాల అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదని హెచ్చరించింది.