చైనానుంచి మరొక వైరస్ మహమ్మారి .. హెచ్చరించిన ఐసీఎంఆర్
By: Sankar Tue, 29 Sept 2020 07:58 AM
చైనాలో పుట్టిన కరోనా వైరస్తో ఇప్పటికే తల్లడిల్లుతున్న భారత్కు ఆ దేశం నుంచి మరో ప్రమాదకర వైరస్ వ్యాపించే ప్రమాదం ఉందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ప్రకటించింది.
పందుల్లో ఉండే ‘క్యాట్ క్యూ వైరస్' (సీక్యూవీ) దోమల ద్వారా భారత్లోకి ప్రవేశించే ప్రమాదం ఉన్నదని సోమవారం హెచ్చరించింది. ఈ వైరస్ క్యూలెక్స్ దోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఐసీఎంఆర్, పుణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ కలిసి దేశవ్యాప్తంగా 883 సీరమ్ నమూనాలు సేకరించగా అందులో ఇద్దరిలో సీక్యూవీ వైరస్ను ఎదిరించే యాంటీబాడీలు ఉన్నట్టు గుర్తించారు.
కర్ణాటకకు చెందిన ఈ ఇద్దరికి సీక్యూవీ సోకి తగ్గిపోయినట్టు నిర్ధారించారు. ఈ సర్వే ఆధారంగా సీక్యూవీ వైరస్ను గుర్తించే టెస్టును అభివృద్ధి చేశారు. చైనా, వియత్నాంలలో ఈ వైరస్ వేగంగా వ్యాపిస్తున్నది. కాగా తొలుత చైనాలో పుట్టిన కరోనా వైరస్ గత పది నెలలుగా ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తుంది...కరోనా దెబ్బకు అగ్ర రాజ్యం అయిన అమెరికా తో సహా చాల దేశాలు కుదేలయ్యాయి..