వైమానిక దళంలోకి నేడు ప్రవేశించనున్న రాఫెల్..
By: Sankar Thu, 10 Sept 2020 11:26 AM
రఫేల్ యుద్ధ విమానం నేడు భారత వైమానిక దళంలోకి లాంఛనంగా ప్రవేశించనుంది. అంబాలాలోని ఏయిర్బేస్లో ఉదయం 10గంటలకు కార్యక్రమం జరుగనుంది. ఫ్రాన్స్కు చెందిన డసాల్ట్ ఏవియేషన్స్ నుంచి మొదటి దశలో ఐదు అత్యాధునిక యుద్ధ విమానాలు జూలై 27న అంబాలాకు చేరిన విషయం తెలిసిందే.
కార్యక్రమానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఫ్రాన్స్ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్ పార్లీ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఎయిర్ స్టాఫ్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ భదౌరియా, రక్షణ కార్యదర్శి డాక్టర్ అజయ్ కుమార్, రక్షణ శాఖ ఆర్అండ్డీ కార్యదర్శి, డీఆర్డీఓ చైర్మన్ సతీశ్రెడ్డి, రక్షణ మంత్రిత్వ శాఖలోని ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్ననున్నారు.
అలాగే ఫ్రెంచ్ ప్రతినిధి బృందానికి చెందిన ఫ్రాన్స్ రాయబారి ఇమ్మాన్యుయేల్ లెనైన్, ఎయిర్ జనరల్ ఎరిక్ ఆటోలెట్, ఫ్రెంచ్ వైమానిక దళం వైస్ చీఫ్ ఇతర సీనియర్ అధికారులు పాల్గొంటారు. ఫ్రెంచ్ డిఫెన్స్ ఇండస్ట్రీస్ సీనియర్ ప్రతినిధి బృందం ఎరిక్ ట్రాపియర్ చైర్మన్, డసాల్ట్ ఏవియేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్, ఎంబీడీఏ సీఈఓ ఎరిక్ బెరాంజర్ సైతం కార్యక్రమానికి హాజరవనున్నారు.
ఫ్రాన్స్ డిఫెన్స్ మినిస్టర్ ఫ్లోరెన్స్ పార్లీకి గార్డ్ ఆఫ్ ఆనర్ ఇవ్వనున్నారు. అంబాలలో రఫేల్ విమానం ఆవిష్కరణ, సంప్రదాయ పూజలు నిర్వహించనున్నారు. అలాగే రఫేల్, తేజస్ విమానాల ఎయిర్ డిస్ప్లే, అనంతరం రఫేల్ యుద్ధ విమానాలకు వాటర్ సెల్యూట్తో కార్యక్రమం ముగుస్తుంది. కార్యక్రమానంతరం భారత, ఫ్రెంచ్ ప్రతినిధి బృందం ద్వైపాక్షిక సమావేశం జరుగనుంది.