ఐపీయల్లో వర్ణ వివక్ష ఉంది ..డారెన్ సామి సంచలన వ్యాఖ్యలు
By: Sankar Sun, 07 June 2020 1:29 PM
వర్ణ వివక్ష మీద జరుగుతున్న పోరాటంలో ఒక్కరు ఒక్కరుగా తమ గళం విప్పుతున్నారు..తాజాగా వెస్ట్ ఇండీస్ మాజీ కెప్టెన్ డారెన్ సామీ వర్ణ వివక్షతపై తన ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో సన్రైజర్స్కు ఆడినప్పుడు తనపై జాత్యంహకార వ్యాఖ్యలు చేశారని మండిపడ్డాడు. అమెరికాలో జాత్యహంకార దాడిలో ప్రాణాలు కోల్పోయిన జార్జి ప్లాయిడ్కు మద్దతుగా అక్కడి స్థానికులతో కలిసి నిరసన వ్యక్తం చేసిన సామి ఇలాంటివి జరగడం దారుణమని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా తాను కూడా వర్ణ వివక్ష వ్యాఖ్యలు ఎదుర్కొన్నట్లు ఇన్స్టాగ్రామ్ ద్వారా సామి పేర్కొన్నాడు.
నేను ఐపీఎల్లో సన్రైజర్స్ జట్టుకు ఆడేటప్పుడు నాతో పాటు శ్రీలంక ఆటగాడు తిసార పెరీరాను 'కలు' అనే పదంతో పిలిచేవారు.అప్పట్లో కలు అంటే బలమైన నల్ల మనిషి అని అనుకున్నా. ఆ సమయంలో వారు నన్ను పొగుడుతున్నారని భావించాను. కానీ ఇప్పుడు ఆ పదానికి అసలైన అర్థం ఏంటో తెలుసుకున్నా. తనతో పాటు పెరీరాపై జట్టులోని ఆటగాళ్లు జాత్యహంకార పదం ఉపయోగించారు. వారు నన్ను చాలా దారుణంగా అవమానించారు. ఈ విషయం తెలిసినప్పటి నుంచి వారిపై చాలా కోపంగా ఉంది.' అంటూ చెప్పుకొచ్చాడు.
అంతకుముందు ట్విటర్ వేదికగా అమెరికాలో జాత్యహంకారానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటానికి మద్దతు ఇవ్వాలంటూ ఐసిసి, ఇతర క్రికెట్ బోర్డులకు సామి విజ్ఞప్తి చేశాడు. 'ఐసిసితో పాటు ఇతర బోర్డులకు ఒక విజ్ఞప్తి.. నాలాంటి నల్లజాతి వారికి ఏమి జరుగుతుందో మీరు చూడడం లేదా? ఈరోజు అమెరికాలో జరిగిన సంఘటన ప్రపంచంలో ఎక్కడైనా జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు నిశబ్ధంగా ఉండాల్సిన సమయం మాత్రం కాదు. సామాజిక అన్యాయంపై స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది' అంటూ పేర్కొన్నాడు.