దీపావళి రోజు కేవలం ఆ రెండు గంటలు మాత్రమే టపాసులు కాల్చాలి ....సీపీ అంజనీ కుమార్
By: Sankar Fri, 06 Nov 2020 06:56 AM
ఈ నెల 14న దీపావళి సందర్భంగా హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో కాల్చే బాణాసంచా విషయంలో నిబంధనలు విధించినట్టు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు.
నగరంలో శాంతిభద్రతలు, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని సుప్రీం కోర్టు ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన వెల్లడించారు. ఈ నెల 12వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 16వ తేదీ వరకూ ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని స్పష్టం చేశారు. దీపావళి రోజున రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే బాణాసంచా అనుమతిస్తామని చెప్పారు..
కాలుష్య నియంత్రణ మండలి నిర్దేశించిన పరిమాణంలో శబ్దం వచ్చే క్రాకర్స్ మాత్రమే కాల్చాలని సూచించారు. ప్రధాన ప్రాంతాలు, పబ్లిక్ ఏరియాల్లో బాణాసంచా కాల్చడాన్ని నిషేధించినట్టు అంజనీ కుమార్ తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే వారిపై హైదరాబాద్ పోలీస్ యాక్ట్, 1348 ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.