Advertisement

హైదరాబాద్ మెట్రో దేశంలోనే నెంబర్ 2...!

By: Anji Sun, 08 Nov 2020 6:40 PM

హైదరాబాద్ మెట్రో దేశంలోనే నెంబర్ 2...!

దేశంలో మెట్రో రైలు పట్ల ప్రయాణీకుల్లో ఆదరణ పెరుగుతోంది. పద్దెనిమిది సంవత్సరాల క్రితం ప్రారంభమైన న్యూఢిల్లీ మెట్రోరైలు సహజంగానే దేశంలో అత్యధిక ప్రజాదరణ కలిగిన మెట్రో కాగా.. కేవలం మూడేళ్ళ క్రితం ప్రారంభమైన హైదరాబాద్ దేశంలోనే రెండో స్థానంలో వుంది.

దేశంలో ప్రజాదరణ, ప్రయాణీకుల ఆదరణలో హైదరాబాద్ మెట్రో రైలు రెండో స్థానానికి చేరింది. దేశంలో మెట్రో రైలు ప్రయాణీకుల సంఖ్యలో గణనీయమైన పెరుగుదల కనిపిస్తోందని తాజా అధ్యయనంలో తేలింది.

దేశంలో మెట్రో రైలు ముందుగా న్యూఢిల్లీలో అరంగేట్రం చేసింది. న్యూఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి ప్రారంభమయ్యే మెట్రో రైలు దేశంలోనే అత్యంత లగ్జరియస్ మెట్రో రైలుగా పేరుగాంచింది. అయితే.. న్యూఢిల్లీ మెట్రో ఇపుడు మహానగరంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించింది.

మొత్తం 8 ప్రధాన రూట్లతోపాటు పలు లింకు రూట్లతో ఢిల్లీ మెట్రో నగరంలో ప్రజల ప్రయాణానికి ప్రధాన విభాగంగా మారిపోయింది.

ఢిల్లీ తర్వాత అదే స్థాయిలో విస్తరించింది హైదరాబాద్ మెట్రో రైలు. నగరంలోని ప్రధాన ప్రాంతాలను కలుపుతూ మూడు రూట్లలో నిర్మాణమైన మెట్రో రైలు 2017 నవంబర్ 28న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభమైంది.

ఆ తర్వాత మొత్తం మూడు రూట్లలో మెట్రో రైలు క్రమంగా ప్రయాణించడం మొదలైంది. అయితే తొలుత ప్రతిపాదించినట్లుగా జూబ్లీ బస్టాండ్ నుంచి ఫలక్‌నుమా ఫ్యాలెస్ దాకా మెట్రో ప్రారంభం కాలేదు. ఆ రూట్లో జేబీఎస్ నుంచి ఇమ్లీబన్ బస్టాండ్ వరకే మెట్రో రైలు నడుస్తోంది.

ప్రారంభమైన నాటి నుంచి అత్యంత ప్రజాదరణ పొందుతున్న హైదరాబాద్ మెట్రో రైలును లాక్‌డౌన్ దెబ్బకొట్టినా.. తిరిగి ప్రారంభమైన తర్వాత మెట్రోరైలు పూర్వపు ఆదరణ పొందే దిశగా సాగుతోంది. ఈనేపథ్యంలో విడుదలైన ఓ అధ్యయనం ప్రకారం దేశంలోనే హైదరాబాద్ మెట్రో రైలు రెండో అత్యంత ప్రజాదరణ పొందిన రైలుగా నిలిచింది.

తాజాగా మెట్రో రైలు మార్గాన్ని రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు దాకా, కూకట్‌పల్లి నుంచి హైటెక్ సిటీ దాకా, ఎల్బీ నగర్ నుంచి రామోజీ ఫిల్మ్ సిటీ దాకా, తార్నాక నుంచి ఈసీఐఎల్ దాకా, జూబ్లీ బస్టాండ్ నుంచి అల్వాల్ దాకా విస్తరించాలన్న డిమాండ్లు గట్టిగా వినిపిస్తుండగా వాటిలో కొన్ని ప్రభుత్వ పరిశీలనలో వున్నాయి.

Tags :

Advertisement