హైదరాబాద్ సీపీ పరిధిలో తగ్గిన క్రైమ్ రేట్
By: Sankar Mon, 21 Dec 2020 4:09 PM
ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో సోమవారం క్రైం వార్షిక ప్రెస్మీట్ నిర్వహించారు. గతేడాదితో పోల్చితే హైదరాబాద్ సీపీ పరిధిలో క్రైమ్ రేటు 10 శాతం తగ్గినట్లు సీపీ అంజనీకుమార్ వెల్లడించారు. ఇక 2019 లో 25,187 కేసులు నమోదు కాగా.. 2020లో 22,641 నమోదయినట్లు వార్షిక నివేదిక వెల్లడించింది.
మహిళలు, పిల్లలపై జరిగే నేరాల్లో 19శాతం, 35శాతం తగ్గుదల కనిపించింది. 2019లో మహిళలపై నేరాలకు సంబంధించి 2,354 కేసులు నమోదు కాగా.. 2020లో 1,908 కేసులు నమోదు అయినట్లు నివేదిక వెల్లడించింది. 2019లో పిల్లలపై నమోదైన కేసులు 339, కాగా 2020లో 221 కేసులు నమోదయ్యాయి. ఇక ఈ ఏడాది జీహెచ్ఎసీంలో 1,46,55,520 రూపాయల నగదు సీజ్ చేసినట్లు వార్షిక క్రైమ్ రిపోర్టు వెల్లడించింది.
కాగా గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది సైబర్ క్రైం పెరిగింది. 2019లో 1,393 సైబర్ కేసులు నమోదయితే 2020 లో 2,406 కేసులు నమోదు అయ్యాయి. ఇంటర్ నెట్ వినియోగించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. దేశ వ్యాప్తంగా జరుగుతున్న సైబర్ క్రైమ్లు రాజస్తాన్లోని జంతారా నుంచే జరుగుతున్నాయి. 25 శాతం ఓటీపీ మోసాలు పెరిగాయి. ఆన్లైన్ గేమింగ్ యువతను ఆకర్షిస్తుంది. దీన్ని ఆధారంగా చేసుకొని ఎంతో మంది అమాయకులను మోసం చేస్తున్నారు అని అన్నారు అడిషపల్ సీపీ శిఖా గోయల్