వినాయక నిమజ్జనం - 15 వేలమంది పోలీసులు, 50 వేల సిసికెమరాలు
By: Dimple Tue, 01 Sept 2020 00:41 AM
ప్రజలందరూ సామాజిక దూరం పాటిస్తూ గణేశ్ నిమజ్జనం జరుపుకోవాలని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ (సీపీ) అంజనీకుమార్ కోరారు. ట్యాంక్బండ్ వద్ద రేపు జరగనున్న నిమజ్జన ఏర్పాట్లను ఆయన పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఇప్పటి వరకు నగర వ్యాప్తంగా 30వేల విగ్రహాల నిమజ్జనం పూర్తయిందన్నారు.
మంగళవారం జరగనున్న నిమజ్జన కార్యక్రమానికి 15వేల మంది పోలీసు సిబ్బంది విధుల్లో ఉంటారని.. ప్రధాన కూడళ్ల వద్ద డీసీపీ స్థాయి అధికారి పర్యవేక్షణ ఉంటుందని చెప్పారు. పాతబస్తీ నుంచి నిమజ్జనానికి వచ్చే వాహనాలు కొన్ని నాళాల మరమ్మతుల కారణంగా దారి మళ్లిస్తున్నామన్నారు. ట్యాంక్బండ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న 50వేల సీసీటీవీ కెమెరాలతో కమాండ్ కంట్రోల్రూమ్ ద్వారా పర్యవేక్షిస్తామని సీపీ చెప్పారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాలకు సంబంధించిన రూట్ మ్యాప్ను అంజనీకుమార్ విడుదల చేశారు. ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం కూడా హుస్సేన్సాగర్లోనే జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.
భాగ్యనగర వాసులు ఎదురుచూసే ఖైరతాబాద్ మహా గణపతి ఊరేగింపు
మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది. పోలీసుల బందోబస్తు నడుమ ఈ శోభాయాత్ర సాగనుంది. ప్రతిష్టించిన చోటే నిమజ్జనం చేయాలని మొదట్లో ఉత్సవ సమితి సభ్యులు భావించినప్పటికీ.. భక్తుల కోరికతో పాటు పోలీసుల నుంచి కూడా అనుమతి లభించడంతో యథాతథంగా ఊరేగింపు కొనసాగి హుస్సేన్సాగర్లో నిమజ్జనం చేయనున్నారు. రాజ్ దూత్ హోటల్, టెలిఫోన్ భవన్, పాత సెక్రటేరియట్ మీదుగా వెళ్లి క్రేన్ నంబర్ 4 వద్ద నిమజ్జనం జరగనుంది.