బిడ్డతో ఇంటికొచ్చిన భార్య కు కంగుతినే షాక్ ఇచ్చాడు భర్త...!
By: Anji Sun, 20 Dec 2020 3:47 PM
ప్రసవం కోసం పుట్టింటికెళ్లిన భార్యకి తిరిగొచ్చేసరికి ఊహించిన షాకిచ్చాడో ప్రబుద్ధుడు. ఆమె స్థానం మరొకరికి ఇచ్చేశాడు. రెండో పెళ్లి చేసుకుని గుట్టుచప్పుడుకాకుండా కాపురం చేస్తున్నాడు.
ఆస్పత్రిలో వదిలివెళ్లిన భర్త తిరిగిరాకపోవడంతో నెలరోజుల తర్వాత బిడ్డతో ఇంటికొచ్చిన భార్య విషయం తెలిసి కంగుతింది. అదేంటని నిలదీస్తే వరకట్నం కావాలంటూ అత్తింటి వారు వేధింపులకు దిగడంతో దిక్కుతెలియని స్థితిలో పోలీసులను ఆశ్రయించింది.
ఈ దారుణ ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. రామకుప్పం మండలం మణీంద్రానికి చెందిన మంజునాథ్కి శోభతో వివాహమైంది. వారికి ఒక కొడుకు ఉన్నాడు. మరోసారి గర్భం దాల్చిన శోభను ప్రసవం కోసం నెలన్నర కిందట కుప్పం ఆస్పత్రిలో చేర్పించాడు.
అప్పటి నుంచి తిరిగిచూడలేదు. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన శోభ పుట్టింటి నుంచి ఇటీవల అత్తింటి వచ్చింది. భర్త రెండో పెళ్లి చేసుకున్నాడని తెలిసి షాక్కి గురైంది.
తనను ఆస్పత్రిలో చేర్పించి వి.కోట మండల అట్రపల్లెకి చెందిన అమరావతి అనే యువతిని పెళ్లి చేసుకున్నాడని తెలియడంతో నిలదీసింది.
బిడ్డతో మెట్టినింటికి వచ్చిన ఆమెకు అత్తమామల నుంచి ఆదరణ కరువైంది. అదనపు కట్నం తెస్తేనే తమ కొడుకు కాపురం చేస్తాడంటూ ఆమె అత్తమామలు నీచంగా వ్యవహరించారు.
దీంతో దిక్కుతోచని స్థితిలో ఆమె పోలీసులను ఆశ్రయించింది. తన భర్త మోసం చేసి రెండో పెళ్లి చేసుకున్నాడని ఫిర్యాదు చేసింది.
బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు భర్త మంజునాథ్, అమరావతి, అత్తమామలు యశోదమ్మ, వెంకటేశులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.