అసెంబ్లీలో మాత్రం నూటికి నూరు శాతం సభాపతినే
By: chandrasekar Thu, 09 July 2020 11:27 AM
రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్
తమ్మినేని సీతారాం ఇటీవలి కాలంలో తన మాటలకు పదును పెంచుతున్నారు. హైకోర్టు
తీర్పులు, సొంత
పార్టీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యవహారంపై ఇటీవలే హాట్ కామెంట్లు చేసిన స్పీకర్.
తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి
దయతోనే తాను ఎమ్మెల్యే అయ్యానని స్పీకర్ తమ్మినేని సీతారం మరోసారి
పునరుద్ఘాటించారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్
రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం
ఆముదాలవలసలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ తాను వైఎస్సార్
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనని, ఆ పార్టీ ప్రాథమిక సభ్యుడినని చెప్పారు.
అలాంటి తాను వైఎస్ జయంతి
నిర్వహించకపోతే ఎలాగని స్పీకర్ తమ్మినేని ప్రశ్నించారు. స్పీకర్ అంటే మూతి
ముడుచుకుని కూర్చోవాలా, నియోజకవర్గ ప్రజల పనులు ఎవరు చేస్తారు అంటూ ఘాటుగా
వ్యాఖ్యానించారు. తాను కచ్చితంగా రాజకీయాలు మాట్లాడుతానని తేల్చి చెప్పారు. అయితే
అసెంబ్లీలో మాత్రం నూటికి నూరు శాతం తాను సభాపతినేనని స్పష్టం చేశారు.