ఆన్లైన్ క్లాసులకు సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేసిన ..కేంద్ర మానవ వనరుల శాఖ ..
By: Sankar Tue, 14 July 2020 8:40 PM
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. ప్రతిరోజు వేలల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. దీంతో దేశంలో మూతపడ్డ విద్యాసంస్థలు ఎప్పటినుంచి ప్రారంభమవుతాయనే విషయంలో స్పష్టత కొరవడింది. మరోవైపు కొన్ని పాఠశాలలు, కళాశాలలు ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నాయి. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వంగానీ, రాష్ట్ర ప్రభుత్వాలుగానీ ఎలాంటి విధానాన్ని రూపొందించలేదు. దీంతో పలువురు న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు.
ఈ నేపథ్యంలో మంగళవారం కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఆన్లైన్ క్లాసులకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. విద్యార్థులకు గంటల తరబడి ఆన్లైన్ క్లాసులు బోధించకుండా స్క్రీన్ టైమ్ కుందించాలని హెచ్ఆర్డీ మినిస్ట్రీ సూచించింది.
ప్రీ ప్రైమరీ విద్యార్థులకు రోజులో 30 నిమిషాల కంటే ఎక్కువ సమయం ఆన్లైన్ బోధన ఉండరాదని తెలిపింది. 1 నుంచి 8 తరగతుల విద్యార్థులకు రోజుకు రెండు ఆన్లైన్ సెషన్ల చొప్పున ఒక్కో సెషన్ 45 నిమిషాల వరకు ఉండొచ్చని.. 9 నుంచి 12 తరగతుల విద్యార్థులకు 30-45 నిమిషాలు ఒక చొప్పున నాలుగు సెషన్లు మించరాదని కేంద్రం మార్గదర్శకాల్లో పేర్కొన్నది.