Advertisement

ఏపీ బీజేపీ నేతల హౌస్ అరెస్ట్‌లు...!

By: Anji Fri, 18 Sept 2020 10:23 AM

ఏపీ బీజేపీ నేతల హౌస్ అరెస్ట్‌లు...!

ఏపీ బీజేపీ శుక్రవారం చలో అమలాపురంకు పిలపునిచ్చింది. దీంతో బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. తాడేపల్లిలో సోము‌ వీర్రాజు నివాసానికి పెద్ద ఎత్తున బీజేపీ నేతలు, కార్యకర్తలు చేరుకున్నారు. వీర్రాజు బయటకు రాకుండా హౌస్ అరెస్ట్ చేశారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వీర్రాజు నివాసం వద్ద పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇటు బీజేపీ మాజీ అధ్యక్షులు కన్నా లక్ష్మీ నారాయణను హౌస్ అరెస్ట్ చేశారు.


ప్రకాశం జిల్లా కారంచేడులో బీజేపీ మహిళా నేత దగ్గుబాటి పురంధేశ్వరిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. మాజీమంత్రి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావెల కిషోర్ బాబును హనుమాన్ జంక్షన్‌లో పోలీసులు అడ్డుకున్నారు.. పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇటు అమలాపురం చేరుకున్న బీజేపీ నేత విష్ణువర్ధన్‌ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.. అమలాపురం నుంచి పోలీస్ వాహనంలో గుర్తుతెలియని ప్రాంతానికి తీసుకెళ్లారు. ప్రభుత్వం ఎన్ని‌ అడ్డంకులు సృష్టించినా... చలో అమలాపురం ఈరోజు జరిగి తీరుతుందని సోము‌ వీర్రాజు ప్రకటించారు.


వైసీపీ ప్రభుత్వం చేస్తున్న దమనకాండను దేశ వ్యాప్తంగా ప్రచారం చేస్తామన్నారు. ఇటు విశాఖలో బీజేపీ నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. రాష్ట్రంలో ప్రజా హక్కులను అణిచివేస్తున్నారని.. పోలీస్ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు నేతలు. ఇటు అమలాపురంలో పోలీసుల్ని ఎక్కడికక్కడ భారీగా మోహరించారు. బీజేపీ నేతలు పట్టణంలోకి ప్రవేశించకుండా కోనసీమకు వచ్చే అన్ని దారులను మూసివేశారు. కొందరు నేతలు అర్ధరాత్రి ఏదోలా పట్టణంలోకి రాగా వారిని గుర్తించి అరెస్ట్ చేసి గుర్తు తెలియని ప్రాంతాలకు తరలించారు.

Tags :

Advertisement