నా భర్తను చంపినవారిని ఎన్కౌంటర్ చేయాలి.. హేమంత్ భార్య
By: Sankar Fri, 25 Sept 2020 1:03 PM
తన భర్తను దారుణంగా హతమార్చిన వారిని కఠినంగా శిక్షించాలని హేమంత్ కుమార్ భార్య అవంతి డిమాండ్ చేశారు. తన మేనమామతో కలిసి మరో ఇద్దరు హేమంత్ను హత్య చేశారని ఆమె తెలిపారు.
అవంతి శుక్రవారమిక్కడ మాట్లాడుతూ.. ‘మేము 8 ఏళ్లుగా మేమిద్దం ప్రేమించుకున్నాం. అయితే పెళ్లికి మా తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. అందుకే ఇంట్లో నుంచి వెళ్లిపోయి ఈ ఏడాది జూన్లో వివాహం చేసుకున్నాం. ఆ తర్వాత పోలీసుల సమక్షంలోనే తల్లిదండ్రులతో రాజీ కుదిరింది. నాతో వాళ్లకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. అలాగే నా పేరు మీద ఉన్న ఆస్తులన్నీ మా నాన్నకు రాసిచ్చేశాను..
నిన్న మధ్యాహ్నం మా మేనమామతో పాటు మరికొంతమంది ఇంట్లోకి చొరబడి మా ఇద్దర్ని కిడ్నాప్ చేశారు. కారులో తీసుకువెళుతుండగా ఇద్దరం అందులో నుంచి కిందకు దూకేశాం. అయితే హేమంత్ను కొట్టుకుంటూ బలవంతంగా మళ్లీ కారులో తీసుకుని వెళ్లిపోయారు. నేను కిడ్నాపర్ల నుంచి తప్పించుకుని వెంటనే 100కి కాల్ చేసినా.. 40 నిమిషాల వరకు పోలీసులు స్పందించలేదు. హేమంత్ చనిపోయినట్లు ఇవాళ ఉదయం పోలీసులు మాకు చెప్పారు. నల్గొండ జిల్లాలో ప్రణయ్ను హత్య చేసిన మారుతీరావు చివరకు ఏమయ్యారో అందరం చూశాం.
హేమంత్ను చంపినవాళ్లను ఎన్కౌంటర్ చేయాలి. నన్ను ప్రేమించినవాళ్లు అయితే హేమంత్ను ఎలా చంపుతారు. పోలీసులు సకాలంలో స్పందిస్తే ఇలాంటి ఘటన జరిగేది కాదు. మమ్మల్ని కిడ్నాప్ చేశాక సాయం చేయాలని అర్థించినా ఎవరూ ముందుకు రాలేదు. మా తల్లిదండ్రులతో మమ్మల్ని కలుపుతారని అనుకున్నా.. నమ్మించి మోసం చేశారు. నా వల్లే ఇదంతా జరిగింది. నేనే లేకుంటే హేమంత్ ఇవాళ బతికి ఉండేవాడు’ అని ఆవేదన వ్యక్తం చేశారు.