పోలీస్ అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించిన హోమ్ మంత్రి మహమూద్ అలీ
By: Sankar Wed, 21 Oct 2020 11:12 AM
పోలీస్ అమవీరుల దినోత్సవ సందర్భంగా ఎల్బీ స్టేడియంలో అమరవీరుల సంస్మరణ సభ జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్రెడ్డితో పాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలీస్ అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు.
అనంతరం హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ విధి నిర్వహణలో అసువులుబాసిన అమర పోలీస్, జవాన్లకు శ్రద్ధాంజలి ఘటించారు. సమాజ భద్రత, ఉజ్వల భవిష్యత్ కోసం ఎందరో పోలీసులు విధి నిర్వహణలో ప్రాణాలు త్యాగం చేశారని, చేస్తున్నారన్నారు. త్యాగధనులకు సమాజం రుణపడి ఉందన్నారు. రాష్ట్రంలో పోలీసులు విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉంటున్నారన్నారు.
తెలంగాణ పోలీసులకు దేశవ్యాప్తంగా గుర్తింపు వస్తుందన్నారు. కరోనా సమయంలో వారి సేవలు మరువలేనివన్నారు. అంతకు ముందు డీజీపీ మహేందర్రెడ్డి మాట్లాడారు. పోలీస్ వ్యవస్థపై విశ్వాసం పెంపొందించే దిశగా చేపట్టిన పలు కార్యక్రమాలతో సత్ఫలితాలు లభిస్తున్నాయి.
తెలంగాణ పోలీస్ శాఖకు దేశవ్యాప్త గుర్తింపు రావడానికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, హోం మంత్రి మహమూద్ అలీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నానన్నారు. అంతకు ముందు హోంమంత్రి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.